మొయినాబాద్ : జిల్లాలో సుమారుగా నాలుగు లక్షల ఎకరాల వరకు పంట నమోదు అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు క్రాప్ నమోదు నిర్వహిస్తుండగా శుక్రవారం పంట వివరాలను తెలుసుకోవడానికి మండల పరిధిలోని సురంగల్ గ్రామా న్ని సందర్శించారు. ఎల్గని శ్రీనివాస్ గౌడ్, యాలాల శ్రీనివాస్రెడ్డికి చెందిన పంట పొలాలను సందర్శించి పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వే నంబర్ ప్రకారం క్రాప్ నమోదు పూర్తి అయితే సరైనా అంచనా వేయొచ్చని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వే నంబర్ ప్రకారం ఎన్ని ఎకరాల్లో ఏయే పంట సాగు చేశారనే వివరాలను సేకరిస్తున్నారన్నారు.
సేకరించిన పంట వివరాలను సర్వే నంబర్, రైతుల పేర్లతో పాటు సాగు చేసిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో వర్షాలు ఆలస్యంగా రావడంతో పంటలు రైతులు ఆలస్యంగా సాగు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికి వరినాట్లు వేస్తూనే ఉన్నారని చెప్పారు. జిల్లాలో 1. 76లక్షల మంది రైతులు పంట బీమా చేయించుకున్నారని తెలిపారు. జిల్లాలోని రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. లేని పక్షంలో తమ పొలంలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవడానికి కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాగమ్మ, గ్రామ సర్పంచ్ గడ్డం లావణ్య, ఏఈవో కుమార్, కారోబార్ సోమ శేఖర్యాదవ్, వీఆర్ఏ శ్రీనివాస్ యాదవ్, రైతులు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొమురయ్య ఉన్నారు.