పరిగి : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్ వ్యాక్సినేషన్ను వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2కోట్ల మందికి వ్యాక్సిన్ వేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3లక్షల మందికి కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
కరోనా ప్రస్తుతం పూర్తి నియంత్రణలోనే ఉందని, భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆయన అభినందించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న సబ్ సెంటర్, వాటి పరిధిలో గల గ్రామాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అవసరమైన మేరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేయాలని, ఇంటింటి సర్వే చేపట్టి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు డోర్లకు స్టిక్కర్లు అంటించాలన్నారు.
జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 1, 51, 600 మందికి మొదటి విడుతగా, 42,000 మందికి రెండవ విడతగా ఇప్పటివరకు వ్యాక్సినేషన్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మిగిలిన వారికి రెండు వారాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. గురువారం నుంచి గ్రామాలు, వార్డుల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడానికి వైద్య అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, జిల్లా వైద్యాధికారి తుకారాం, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర పాల్గొన్నారు.