వికారాబాద్ : ఫొటో గ్రాఫర్ తీసే ఒక్క క్లిక్.. ఎన్నో భావాలకు నిదర్శనంగా మారుతుందని వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు. గురువారం ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో జిల్లా ఫొటో గ్రఫి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ సంజీవరావు, అడ్వకేట్ మాదవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క ఫొటోతో ఎన్నో భావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే అద్భుతమైన శక్తి ఒక్క ఫోటో గ్రఫికే ఉంటుందన్నారు. మానవ జీవితానికి ఈ ఫొటో గ్రఫీకి అవినాభావ సంబంధం ఉండటం వలనా, కాల గర్భంలో కలిసిపోయిన ఎన్నో విషయాలను ఫొటోలే నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు.
బ్లాక్ అండ్ వైట్తో ప్రారంభమైన ఫొటో గ్రఫీ కాలానుగుణంగా కలర్ ఫుల్గా మారింది. దీంతో ఫొటో గ్రఫీ రోజు రోజుకు ఎన్నెన్నో ప్రత్యేకతలను పరిచయం చేస్తూ కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ప్రపంచ ఫొటో గ్రఫీ దినత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా ఫొటో గ్రఫీ ఆధ్వర్యంలో 15మంది ఫొటో గ్రాఫర్లు రక్తం దానం చేశారు. వికారాబాద్ కొంపల్లిలోని మహిమా మినిస్ట్రీస్ అనాథాశ్రమంలో అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వికారాబాద్ ఫొటో గ్రఫి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి నర్సింహులు, కోషాధికారి భూపాల్, అసోసియేషన్ సభ్యులు కిష్టారెడ్డి, పద్మాకర్, నర్సింహులు పాల్గొన్నారు.