ఆర్కేపురం : అన్నిదానాల్లోకెల్ల అన్నదానం ఎంతో గొప్పదని ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్గుప్తా అన్నారు. ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాడేపల్లి వెంకటేశంగుప్తా ఆధ్వర్యంలో అమావాస్య అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్గుప్తా హాజరై అన్నవితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లి వెంకటేశంగుప్తా దేవాలయంలో ప్రతి అమవాస్యకు అన్న ప్రసాద వితరణ చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, ఆలయ చైర్మన్ జగిని రమేష్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాపిశెట్టి పురుషోత్తంగుప్త, పి.శ్రీనివాస్, అనిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.