ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామ, మండల, మున్సిపాలిటీలకు నూతన కార్యవర్గ కమిటీల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని గ్రామ, మండల స్థాయిలో మరింత పటిష్టంగా తయారు చేయడం కోసం నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి పార్టీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేసే నాయకులు, కార్యకర్తలకు కార్యవర్గంలో స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నెల 2న ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేస్తున్నందున, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 2న ప్రతి తెరాస నాయకులు, కార్యకర్తలు తమ వార్డులు, గ్రామాల్లో, మండలాల్లో, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. అలాగే, ప్రతి కార్యకర్త ఇంటిపై కూడా జెండాలు ఎగురవేయాలన్నారు. అనంతరం 10గంటలకు ఇబ్రహీంపట్నం నియోజవకర్గ కేంద్రంలో జరిగే తెరాస జెండావిష్కరణ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. టీఆర్ఎస్ జెండావిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ఆయన కోరారు.
ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం గ్రామ స్థాయిలో జెండా పండుగను విజయవంతం చేయవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ జెండా పండుగలో భాగస్వామ్యం అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీలు కృపేష్, నర్మద, మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, పూజారి చక్రవర్తి, చీరాల రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మాజీ చైర్మన్ భరత్కుమార్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.