చేవెళ్ల టౌన్ : పశువులకు సీజన్లో వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు వహించాలని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప తెలిపారు. శనివారం చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల, దామరిగిద్ద, కందవాడ, రావులపల్లి గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్కుమార్రెడ్డి ఊరెళ్ల గ్రామంలో నిర్వహించిన నట్టల నివారణ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల అనారోగ్యానికి గురైన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని తెలిపారు. పశువులకు ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ మందులు వేయిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు భూషణం, ఉప సర్పంచ్ విఠలయ్య, రైతులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.