తాండూరు రూరల్ : బాలల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని, వారి హక్కులను కాపాడేందుకు ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా బాల రక్ష భవన్ కో-ఆర్డినేటర్ శ్రీలక్ష్మి అన్నారు. మంగళవారం తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులకు, అంగన్వాడీ టీచర్లకు ‘బాలల పరిరక్షణ’ పై అవగాహన కల్పించారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను అక్రమ దత్తత చట్టరిత్యా నేరమన్నారు. దత్తత ప్రక్రీయలో ఎటువంటి మధ్యవర్తిత్వానికి తావులేదని స్పష్టం చేశారు.
అక్రమంగా దత్తతకు పాల్పడితే సెక్షన్ 81, జెజె యాక్టు 2015 ప్రకారం శిక్షించడంతో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయాల జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. 18ఏండ్లలోపు అమ్మాయిలకు, 21ఏండ్ల లోపు అబ్బాయిలకు వివాహం చేయడం చట్టపరంగా నేరమని తెలిపారు. బాల్యవివాహాన్ని ప్రోత్సహించిన, అమ్మాయి తల్లిదండ్రుల, సంరక్షకులకు కూడా శిక్షణ పడుతుందన్నారు. అదే విధంగా బాల్యవివాహాలపై వారిలో చైతన్య తీసుకువచ్చేందుకు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కిషోర బాలకిల రిజిస్టర్, బాలికల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
బాలికల వేధింపుల పై తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మీ పై ఉందన్నారు. గ్రామస్థాయిలో తప్పని సరిగా వివాహాలను నమోదు చేయించాలని సూచించారు. అదే విధంగా జనన, మరణల వివరాలు కూడా నమోదై ఉండాలన్నారు. గ్రామ బాలల పరిరక్షణ కమిటీ సభ్యుల వివరాలు పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుదర్శన్రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యులు సబిత, లక్ష్మణ్, సూపర్వైజర్లు నిర్మల, చైల్డ్లైన్ ప్రతినిధులు జ్యోతి ఉన్నారు.