మొయినాబాద్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు ఉపాధి కల్పనలో విశేష కృషి చేయడం వలనే కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించిందని కళాశాల చైర్మన్ కే. కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా వచ్చిందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది నుంచి 10 ఏండ్ల పాటు స్వయం ప్రతిపత్తి హోదా ఉంటుందని తెలిపారు. స్వయం ప్రతిపత్తి హోదా రావడం వలన విద్యార్థులకు చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.
స్వయం ప్రతిపత్తితో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ప్రత్యేక నిధులు మంజూరు అవుతాయన్నారు. విద్యా సంబంధితమైన సిలబస్లో 20శాతం వరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకోవచ్చాన్నారు. కళాశాల ఏర్పాటు అయి 14 ఏండ్లు పూర్తి చేసుకుందని చెప్పారు. కళాశాలకు అటానమస్ రావడంతో అందరి బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు కళాశాలలకు ఏ ప్లస్ గుర్తింపు రావడంతో అందులో కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కూడా ఉందని చెప్పారు. కళాశాలకు ఎన్బీఏ అక్రిడిటేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాగీర్దార్, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఏవో రవికిరణ్రెడ్డి ఉన్నారు.