మంచాల, సెప్టెంబర్ 11 : మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పల్లెప్రకృతి వనాలు నందనవనాన్ని తలపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలతో గ్రామాలకు సరికొత్త కళను తెచ్చాయి. తీరొక్క మొక్కలతో ఏర్పాటైన పల్లెప్రకృతి వనాలు ప్రజలకు ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాయి. మంచాల మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం నందనవనాన్ని తలపిస్తున్నది. రెండు ఎకరాల విస్తీర్ణంలో రకరకాల పూలు, పండ్లు నీడనిచ్చే మొక్కలు సుమారు 5వేల వరకు నాటారు. వనంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరుగడంతో చిట్టడవిని తలపించేలా మారింది. ప్రకృతి వనంలోకి పశువులు, ఇతర వ్యక్తులు లోనికి వెళ్లకుండా వనం చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. వనంలోపల ఉదయం, సాయంత్రం పెద్దలు, పిల్లలు వాకింగ్ చేయడానికి వచ్చే వారికి వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. మొక్కల సంరక్షణపై ప్రతి రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వనంలో నాటిన మొక్కలకు ఉదయం, సాయంత్రం నీరు పట్టేందుకు ప్రత్యేకంగా వన సేవకుడిని నియమించింది. హరితహారంలో భాగంగా మంచాలలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదానిస్తున్నాయి.
చిట్టడవిని తలపిస్తున్న పల్లెప్రకృతి వనం..
పల్లెప్రకృతి వనం చిట్టడవిని తలపించేలా మారింది. 5ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో నేడు చెట్లు ఎటుచూసినా ఏపుగా పెరుగడంతో చిట్టడవిగా మారింది. వనంలో నాటిన మొక్కలను సంరక్షించుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి రోజు ఇద్దరి సిబ్బందిచే మొక్కలకు, చెట్లకు నీరు పోస్తున్నారు. పల్లెప్రకృతి వనంలో పండ్లు, పూలమొక్కలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడానికి వచ్చే వారు పండ్లను కోసుకుంటారు. పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో చాలా మంది అక్కడ సేదతీరేందుకు వస్తుంటారు. ప్రకృతి వనంలో తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.
ఆహ్లాదాన్ని పంచుతున్న ప్రకృతి వనం..
మంచాల ప్రకృతి వనంలో తీరొక్క మొక్కలు ఏపుగా పెరుగడంతో అవి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పల్లెప్రకృతి వనంలో 5వేల మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు వనసేవకుడిని నియమించారు. క్రమం తప్పకుండా మొక్కలకు ఉదయం, సాయంత్రం నీళ్లను పోయడంతో అవి ఏపుగా పెరిగి చెట్లను తలపిస్తున్నాయి. గ్రామంలో ఉన్న యువకులు, పెద్దలు సాయంత్రం పల్లెప్రకృతిలోని వాకింగ్ట్రాక్లో వాకింగ్ చేయడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తారని చెప్పారు. మంచాల గ్రామ అభివృద్ధితో పాటు మొక్కల సంరక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పారు.
– జగన్రెడ్డి, సర్పంచ్