ఘట్కేసర్,ఆగస్టు13: అన్నోజిగూడ లక్ష్మీనర్సింహా కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పోచారం ఇన్ఫోసిస్ కృషి చేస్తుందని ఆ సంస్థ రీజినల్ ప్రధాన అధికారి వెంకటేశ్ తెలిపారు. సీనియర్ మేనేజర్ వినోద్తో కలిసి శుక్రవారం ఆయన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రతినిధులు, ఉపాధ్యాయులు , విద్యార్థులతో సమావేశమయ్యారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల అవసరాలు, కావాల్సిన అంశాలపై చర్చించారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యాభ్యాసం సజావుగా కొనసాగేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ సురేశ్, వైస్చైర్మన్ రెడ్యానాయక్, కౌన్సిలర్ రాజశేఖర్, లక్ష్మీనర్సిహా కాలనీ వాసులు, యువకులు పాల్గొన్నారు.