షాబాద్ : చేవెళ్ల ప్రాంతంలో ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లే అవుట్ల అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం సాయంత్రం చేవెళ్ల మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ప్రజాప్రతినిధులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కొత్తూర్ మండలంలోని ఇన్మూల్నర్వా, కందుకూరు మండలం లేమూరులో దాదాపు 150ఎకరాల భూమిని సేకరించి ప్రభుత్వమే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లే అవుట్లు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
అదే తరహాలో చేవెళ్ల ప్రాంతంలో కూడా చేస్తే బాగుంటుందని దీనికి ప్రజలు, రైతుల అభిప్రాయాలు, ఇక్కడ ఉన్న పరిస్థితులు, ధరల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై చర్చించారు. ఈ ప్రాంతం అభివృద్ధి కాబోతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ పూర్తి అభివృద్ధితో లే అవుట్లు చేస్తే డిమాండ్ ఉంటుదన్నారు. దాదాపు 100ఎకరాలు సేకరించేందుకు అనువైన ప్రాంతంలో స్థలాన్ని గుర్తించి చెప్పాలని కోరారు. దీనికి భూములు ఇచ్చిన రైతులకు లే అవుట్లుగా అభివృద్ధి చేస్తారని ప్లాట్లలో 60శాతం భూములిచ్చిన రైతులకు, 40శాతం హెచ్ఎండీఏ విక్రయించుకునేలా ఉంటుందని తెలిపారు.
భూములిచ్చిన రైతులకు ఇచ్చే వాట అభివృద్ధి చేయటంతో ధరలు పెరిగి ఎకరం భూమికి వచ్చే ధరలే దక్కుతాయని ఇది భూములిచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ కూడా రైతుల భూములు కోట్లు పలుకుతున్నాయని, డెవలప్మెంట్కు 70శాతం రైతులకు 30శాతం అయితే గ్రామాల్లో ఉండే రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉందని పలువురు ప్రజాప్రతినిధులు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డీవో వేణుమాధవ్రావు, తాసీల్దార్ అశోక్కుమార్, ఎంపీడీవో హరీశ్కుమార్, సర్పంచ్ శైలజ, ఎంపీటీసీలు వసంతం, రాములు, నాయకులు రమణారెడ్డి, వెంకట్రెడ్డి, మధుసూదన్గుప్తా, మల్లారెడ్డి, రవీందర్, వీరేశం, మాణిక్యం, రైతులు పాల్గొన్నారు.