న్యూఢిల్లీ: హైకోర్టులను తాము తక్కువ చేసి చూడబోమని, అవి న్యాయవ్యవస్థకు మూలస్తంభాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. న్యాయస్థానాల్లో జరిగే చర్చలు తుది తీర్పులకు లోబడి, ప్రజల ఆసక్తిని బట్టి ఉంటాయని వ్యాఖ్యానించింది. విచారణ సమయంలో కోర్టులు లేవనెత్తే కొన్ని ప్రశ్నలు ప్రజాక్షేమం కోణంలో ఉంటాయే తప్ప, మరో ఉద్దేశం ఉండబోదని వెల్లడించింది. న్యాయస్థానాలు కొన్ని సందర్భాల్లో స్వేచ్ఛాపూరిత వ్యాఖ్యలు చేస్తుంటాయని, జడ్జిలు నిర్వహించే ప్రొసీడింగులను ఎన్నికల సంఘం (ఈసీ) వంటి సంస్థలు నియంత్రించలేవని పేర్కొంది. ఎన్నికల ప్రచార సభలకు అనుమతించడం వల్లే దేశంలో కరోనా సెకండ్వేవ్ మొదలైందని, దీన్ని హత్యానేరంగా ఎందుకు పరిగణించకూడదని ఈసీపై మద్రాస్ హైకోర్టు ఇటీవల మండిపడింది. ఈ వ్యాఖ్యలను మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు, వాటికి మీడియా చేసిన ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ షాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కరోనా నియంత్రణ తమ బాధ్యత కాదని, ప్రభుత్వం ఈసీ చేతుల్లో ఉండదని కోర్టుకు తెలిపారు. కరోనా కట్టడికి తాము మార్గదర్శకాలు మాత్రమే జారీచేయగలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలను ప్రజాకోణంలో మాత్రమే చూడాలని సూచించారు. ఆ వ్యాఖ్యలు చేదు గుళికల్లా ఉన్నప్పటికీ, అందులోని సదుద్దేశాన్ని మంచి స్ఫూర్తితో స్వీకరించాలన్నారు. కోర్టులో జరిగే విచారణ, వాదనలపై మీడియా రిపోర్టింగ్ను నియంత్రించాలంటూ ఈసీ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. కోర్టులో జరిగే వాదనలపై మీడియా రిపోర్టింగ్ చేయకుండా నియంత్రించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. మీడియా అనేది శక్తివంతమైన వాచ్డాగ్ అని తెలిపింది.