కొడంగల్ : నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో నెలకొన్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించి రైతులకు పాసుబుక్కులు అందించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక తాసిల్దార్ కార్యాయలంలో ఆర్డివో అశోక్కుమార్తో పాటు మూడు మండలాల తాసిల్దార్లు రవీందర్, షాహెదాబేగం, హర్దిప్సింగ్లతో కలిసి భూ సమ్యలపై రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో మూడు మండలలోని ఆయా గ్రామాలకు సంబంధించి 917 మంది రైతులకు సంబంధించి పట్టా, అసైన్డ్, జాయిట్ ఫారెస్ట్ వంటి ఆయా కారణాలతో భూ సమస్యలు ఉన్నాయని, కాబట్టి చాలా కాలంగా రైతు పట్టా పాసు బుక్కులను అందుకోలేక పోయినట్లు తెలిపారు.
అటువంటి భూములపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యలను పరిష్కరించి వారికి పట్టాదార్ పాసు పుస్తకాలను అందించాలని ఆదేశించారు. పట్టాదార్ పాసు పుస్తకాలు లేని కారణంగా భూమి ఉన్నప్పటికీ రైతుబంధు, రైతుబీమా పథకాలకు దూరం అయినట్లు పేర్కొన్నారు. కాబట్టి అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించి పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందిస్తే రైతులు ఎంతో సంతోషపడతారని తెలిపారు.