కులకచర్ల : విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబర్చి మండలానికి మంచిపేరు తీసుకురావాలని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అన్నారు. మంగళవారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో జట్టుకు విద్యార్థుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబర్చి గ్రామానికి, మండలానికి, పాఠశాలకు పేరు తీసుకురావాలని అన్నారు. గ్రామీణ విద్యార్థులే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు.
విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని ఖోఖోలో మంచి ప్రతిభను కనబర్చాలని సూచించారు. సందర్భంగా ఖోఖో జట్టు ఎంపికలో 50మంది బాలురు, 30మంది బాలికలు పాల్గొనగా అందులో ఉత్తమ ప్రతిభను కనబర్చి 18మంది బాలురు, 16మంది బాలికలను జిల్లా జట్ల ప్రబుల్స్కు ఎంపిక చేశారు. వీరికి ఇదే మైదానంలో ఈ నెల 18 నుంచి 28వరకు క్యాంపు నిర్వహిస్తున్నట్లు పీటీ సుభాష్నాయక్ తెలిపారు. కార్యక్రమంలో దోమ ఎంఈవో హరిశ్చందర్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఖోఖో సంఘం సభ్యులు సత్తిరెడ్డి, శివరాం, రంజిత్, శ్రీనివాస్, స్వాతి, జాట్ అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్ పాల్గొన్నారు.