ఇబ్రహీంపట్నం రూరల్ : ఇబ్రహీంపట్నంలో పలు వ్యాపార సంస్థల యాజమానులు ధనార్జనే ధ్యేయంగా భావిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్పుడ్ కేంద్రాల్లో విచ్ఛలవిడిగా నాణ్యతలేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బేకరీలు, ఫాస్ట్పుడ్ కేంద్రాలకు వెళుతుండటాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా బేకరీల్లో విక్రయించే ఎగ్పఫ్, కరీపఫ్, తదితర పదార్థాల్లో పాచిపోయినవి పెట్టి వాటిని వేడి చేసి విక్రయిస్తున్నారు. ఇక ఫాస్ట్పుడ్ కేంద్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
రోజులతరబడి నుంచి మరిగిపోయిన నూనెతో నూడిల్స్, ఫ్రైడ్రైస్, మంచూరియా, తదితర పదార్థాలను తయారు చేస్తున్నారు. ఇక్కడున్న ఇంజినీరింగ్ కళాశాలలకు రోజుకు వేలాది మంది విద్యార్థులు వస్తుండగా, దూరప్రాంతాల నుంచి వచ్చే వారు ఇక్కడే హాస్టళ్లలో, గదులను అద్దెకు తీసుకుని చదువుకుంటున్నారు. వీరు ఎక్కువగా హోటళ్లు, మెస్లు, ఫాస్ట్పుడ్ కేంద్రాలకు భోజనం కోసం వెళుతుండటంతో ధనార్జనే ధ్యేయంగా భావిస్తున్న వ్యాపారులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వడ్డీస్తున్నారు. పలుహాస్టళ్లు, హోటళ్లలో విచ్ఛలవిడిగా కల్తీ నూనెను కూడా ఉపయోగిస్తూ, ఆహారపదార్థాలను తయారుచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఓ బేకరీలోకి వెళ్లిన విద్యార్థులకు తినేసమయంలో పాచిపోయిన పదార్థాలు వచ్చాయని బేకరీ యాజమానిని ప్రశ్నిస్తే ఇంతచిన్న విషయాన్ని రాద్ధాంతం అవసరమా అని సమాధానమిచ్చాడు. భోజనం విషయంలో ప్రమాణాలను పాటించనిపక్షంలో ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశముంది.
పత్తాలేని ఆహారతనిఖీ అధికారులు
ఇబ్రహీంపట్నంలో విచ్ఛలవిడిగా నాణ్యతలేని ఆహారపదార్థాలను విక్రయిస్తున్నప్పటికీ ఆహార తనిఖీ అధికారుల జాడ మాత్రం కనిపించటం లేదు. దీంతోనే వ్యాపారులకు అడ్డుఅదుపులేకుండా పోయి ఇష్టం వచ్చినట్లు కల్తీనూనెను వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.