కడ్తాల్ : విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థ వ్యవస్థాపకురాలు కోర్పోలు లీలా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని అన్మాస్పల్లిలోని ది ఎర్త్ సెంటర్ సీజీఆర్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చిన 50మంది ఉపాధ్యాయులతో ‘పర్యావరణ ప్రేమికుల ఆత్మీయ కలయిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దాలో తదితర అంశాలపై ఉపాధ్యాయులు తమ అనుభవాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీజీఆర్ వ్యవస్థాపకురాలు లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పదకొండేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మొక్కలను నాటామని తెలిపారు.
ఉపాధ్యాయులతో కలిసి పర్యావరణ కాపాడాటానికి సీజీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పర్యావరణపై అవగాహన కల్పించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పచ్చదనం పెంపుతోనే వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు వాతావరణంలో సమతుల్యత ఏర్పడుతుందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఉపేందర్రెడ్డి, విశ్రాంత డీఈవో విజయ్కుమార్, పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి, ఉన్నతవిద్య జాయింట్ డైరెక్టర్ రాజేందర్సింగ్, డాక్టర్ మల్లికార్జున్, రవీంద్ర, జగన్, సీజీఆర్ ప్రతినిధులు ఉమా మహేశ్వర్రెడ్డి, కృష్ణ, వెంకటేశ్, వర్ధన్రెడ్డి, రజనీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.