ఇబ్రహీంపట్నంరూరల్ : రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆడబిడ్డల పెండ్లిలు ఆర్భాటంగా చేసి అప్పుల పాలవుతున్నారన్నారు. పెళ్లిలు ఆర్బాటంగా చేసి అప్పులు చేసి ఇబ్బందులకు గురికావద్దని తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిలు చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆలోచించి ఎంతో ఉన్నత ఆశయంతో కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. నేడు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 100116లు అందజేసి ఆదుకుంటున్నారని తెలిపారు. పేద ప్రజలకు ఈ డబ్బులు ఎంతో అవసరమని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ పెళ్లి జరిగిన ఆరునెలల లోపు చెక్కులు అందించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కల్యాణలక్ష్మి చెక్కులకు సంబంధించిన సంతకాల కోసం తమ వద్దకు వచ్చిన ఫైల్పై ఎప్పటికప్పుడు సంతకాలు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణలక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకునే తరుణంలో అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు కల్యాణలక్ష్మి పథకంతో పాటు ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందజేస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు.