దిగుబడులు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రానున్న రోజుల్లో రైతు వేదికలు సాగు విజ్ఞాన కేంద్రాలుగా మారుతాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్లో తన సొంత ఖర్చులతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని, చెర్లభూత్కూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. నాడు కచేరీల వద్ద చేరి తమ సాదకబాదకాలు మాట్లాడుకునే రైతులు.. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికల్లో మాట్లాడుకుంటున్నారని తెలిపారు. తన అన్న గంగుల ప్రభాకర్ జ్ఞాపకార్థం కొత్తపల్లి మండలం బద్దిపల్లితోపాటు ముగ్ధుంపూర్లో తన సొంత ఖర్చులతో రెండు రైతు వేదికలు నిర్మించినట్టు చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరిపే బాధ్యత సీఎం కేసీఆర్ తీసుకున్నారని చెప్పారు. ఈసారి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని, ఎంత దిగుబడి మార్కెట్కు వచ్చినా కొనేందుకు ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కనీస మద్దతు ధర ఏ-గ్రేడ్ క్వింటాల్కు రూ.1,888, బీ-గ్రేడ్కు రూ.1,868 చొప్పున చెల్లిస్తున్నామని, ఇందుకు రూ.20 వేల కోట్ల నిధులు సమకూర్చినట్టు మంత్రి వెల్లడించారు.