నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 11: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా టెస్టులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. రెంజల్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం కరోనా పరీక్షలు చేయించినట్లు ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు. 77 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఆయా గ్రామాల సర్పంచులు టీకాలు వేయించారని, చెప్పారు. స్థానిక పీహెచ్సీ పరిధిలో 171 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 40 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. బోధన్ పట్టణంలోని రాకాసీపేట్, పాన్గల్లీ పీహెచ్సీల్లో మొత్తం 142 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 60 మందికి పాజిటివ్గా నిర్దారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు.
ఎడపల్లి పీహెచ్సీలో 69 మందికి టెస్టులు చేయగా, 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. మాక్లూర్ పీహెచ్సీలో 59 మందికి టెస్టులు నిర్వహించగా 27 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యుడు సంజీవ్రెడ్డి, సీహెచ్వో ఆనంద్కుమార్ తెలిపారు. భీమ్గల్ మండలం ముచ్కూర్ పీహెచ్సీలో కొవిడ్ వాక్సినేషన్ను డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్ ఆదివారం ప్రారంభించారు. తొలిరోజు 66 మందికి వాక్సిన్ వేశామని ఆరోగ్య కేంద్రం వైద్యుడు అజయ్ పవార్ తెలిపారు. బోధన్ మండలం సాలూరా పీహెచ్సీలో ఎంపీపీ బుద్దె సావిత్రి కరోనా టీకా తీసుకున్నారు. పీహెచ్సీ పరిధిలో 154 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మెడికల్ ఆఫీసర్ రేఖ తెలిపారు.
కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పొతంగల్ పీహెచ్సీ పరిధిలో మొత్తం 39 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ సమత తెలిపారు. కోటగిరి దవాఖానలో 141 మందికి టెస్టులు చేయగా ఐదుగురికి, పొతంగల్ పీహెచ్సీలో 173 మందికి టెస్టులు చేయగా 34మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. ఇప్పటి వరకు పొతంగల్ పీహెచ్సీలో 430 మందికి, కోటగిరి సీహెచ్సీలో 480 మందికి టీకా వేసినట్లు ఆమె తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నదని, ప్రజలు తప్పకుండా కొవిడ్ నిబంధనలను పాటించాలని డాక్టర్ నవీన్ సూచించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో వినాయక్నగర్ పద్మశాలి తర్ప అధ్యక్షుడు గద్దె భూమన్న ఆధ్వర్యంలో సభ్యులు ఇంటింటికీ తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పించారు. 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో చౌకి రాములు, సత్యనారాయణ, జ్ఞానేశ్వర్, సుదర్శన్, రమేశ్, శ్రీనివాస్, దత్తాద్రి పాల్గొన్నారు. ఇందల్వాయి పీహెచ్సీలో 30 మందికి టెస్టులు నిర్వహించగా 20 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి శుభాకర్ తెలిపారు. వర్ని కమ్యూనిటీ వైద్యశాలలో 37 మందికి టెస్టులు నిర్వహించామని, ఏడుగురు వైరస్బారినపడ్డారని వైద్యాధికారి వెంకన్న తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు టీకా వేయించుకున్నట్లు ఎంపీడీవో బషీరుద్దీన్ తెలిపారు. ఐకేపీ, పంచాయతీ సిబ్బంది సైతం టీకా వేయించుకున్నారన్నారు. 45 ఏండ్లు పైబడిన వారందరూ టీకా వేయించుకోవాలని ఆయన కోరారు. బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో బోధన్ రూరల్ ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరాన్ని పాటించాలని సూచించారు. సర్పంచ్ మంజుల, నాయకుడు సుదర్శన్ పాల్గొన్నారు.
మాస్కులు ధరించనివారికి జరిమానా
నవీపేట మండల కేంద్రంలో మాస్కులు ధరించకుండా రోడ్డుపైకి వచ్చిన వారికి ఎస్సై యాకుబ్, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, గ్రామ కార్యదర్శి సందీప్ వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ..
కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా మోర్తాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో సర్పంచ్ కడారి శ్రీనివాస్ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. దొన్కల్ గ్రామంలో సర్పంచ్ కత్తి లావణ్య ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.