ప్రతి డివిజన్లో పట్టణ ప్రకృతి వనాలు
మూడు డివిజన్లకో నర్సరీ.. గ్రీన్ లెగస్సీలు, వనితా వనాలు
గ్రీన్ బడ్జెట్తో నగరమంతా పచ్చదనం
వరంగల్, ఏప్రిల్ 16 : నగరాల్లో పచ్చదనం కోసం నిధుల కొరత లేకుండా ఉండేందుకు స్థానిక సంస్థల బడ్జెట్లో 10శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేవడం నగరాలు, పట్టణాలకు వరంలా మారింది. ఈమేరకు గ్రేటర్ కార్పొరేషన్లో గ్రీన్ బడ్జెట్ కింద రూ.20కోట్లు కేటాయించారు. దీంతో నగరమంతా పచ్చదనం పరుచుకునేలా అధికారులు ప్రణాళికలు వేసి అమలు చేస్తున్నారు. ప్రతి డివిజన్లో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది పార్కులను గ్రేటర్ అధికారులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గతంలో నగరంలో ఉన్న 14 పార్కులతో పాటు కొత్తగా 8 పార్కులు, రెండు గ్రీన్ లెగస్సీ, వనితా వనాన్ని అభివృద్ధి చేశారు. గ్రీన్ బడ్జెట్ నిధులతో చకచకా పనులు చేస్తున్నారు.
గతంలో నగరాలు, పట్టణాలంటే కాంక్రీట్ జంగళ్లు.. రణగొణ ధ్వనులు. సేద తీరేందుకు ఒకటీ అరా తప్ప ఎక్కడా పార్కులు ఉండకపోయేవి. ఒకవేళ ఉన్నా ఎండిపోయిన చెట్లు, ధ్వంసమైన సిమెంటు బెంచీలు.. చెత్తాచెదారంతో నిండిన పార్కులే కనిపించేవి. ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించేందుకు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన హరితహారం కార్యక్రమం, పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుతో ఇప్పుడు ప్రతి పట్టణం, నగరం నందనవనంలా మారుతున్నది. చారిత్రక ఓరుగల్లు నగరం ప్రతి డివిజన్కో పార్కును రూపొందించుకుని పచ్చదనాన్ని సంతరించుకున్నది.
పార్కులతో కొత్త కళ
కొత్త పార్కులతో గ్రేటర్ కార్పొరేషన్ కొత్తకళ సంతరించుకుంది. గతంలో ఉన్న పార్కులతో పాటు కొత్తగా 8 పార్కులను గ్రేటర్ అధికారులు అభివృద్ధి చేశారు. 16 పార్కులకు ప్రతిపాదనలు రూపొందించి 8 పార్కులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. కుడా ఆధ్వర్యంలో 47వ డివిజన్ పరిధిలోని పార్కును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. బల్దియా ఆధ్వర్యంలో డాక్టర్స్ కాలనీ, ఎల్బీ నగర్, కనకదుర్గ కాలనీ, పరిమళకాలనీ, రామారావు కాలనీ, సంతోష్నగర్ కాలనీ, ఎఫ్సీఐ కాలనీ, టీచర్స్కాలనీలో పార్కులు నెలకొల్పారు. పిల్లల ఆట వస్తువులు, అందమైన పూల చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీటికి తోడు వడ్డేపల్లి బండ్ వద్ద గ్రీన్ లెగస్సీ, ఆటోనగర్లో మరో గ్రీన్ లెగస్సీని అభివృద్ధి చేస్తున్నారు. బల్ది యా ఆవరణలో ఏర్పాటైన వనితా వనం అందరినీ ఆకట్టుకుంటున్నది. పెద్ద సంఖ్యలో పట్టణ ప్రకృతి వనాలు, కొత్త పార్కులు, గ్రీన్ లెగస్సీలతో నగరం నందన వనంగా మారింది.
గ్రేటర్లో 77 పట్టణ ప్రకృతి వనాలు
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 77 పట్టణ ప్రకృతి వనాలు రూపుదిద్దుకుంటున్నాయి. డివిజన్కో వనం చొప్పున ప్రణాళికలు వేశారు. అదనంతో మరో 19 పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. లేఅవుట్ ప్లాట్లు, ప్రభుత్వ స్థలాల్లో పట్టణ ప్రకృతి వనాలు(ట్రీ పార్క్) అభివృద్ధి చేస్తున్నారు. మొదట పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధిలో భాగంగా ప్రహరీలు, బోర్వెల్, గేట్, ఏర్పాటుచేసి మొక్కలు పెంచుతున్నారు. ప్రతి పట్టణ ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. 77 పట్టణ ప్రకృతి వనాలకు రూ.5కోట్లతో అంచనాలు వేశారు. పలుచోట్ల పార్కుల పనులు పూర్తికావచ్చాయి. హార్టికల్చర్ విభాగం ఆధ్వర్యంలో పట్టణ ప్రకృతి వనాల్లోని మొక్కలను సంరక్షిస్తున్నారు. వీటితో పాటు ఎస్సారెస్పీ కాల్వ వెంట రెండెకరాల విస్తీర్ణంలో వనాన్ని పెంచుతున్నారు.
ఇవి కూడా చదవండి
కొవిడ్-19 వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
IPL 2021: రాహుల్ రనౌట్.. పంజాబ్ 2 వికెట్లు డౌన్