కొడంగల్ : ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని మండలాన్ని అభివృద్ధిని చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహిచారు. సమావేశంలో సభ్యుల సమక్షంలో 45 అంశాలను చర్చించి ఆమోదించారు. మొత్తం రూ. 2కోట్ల 49లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. మున్సిపల్ పరిధిలో సీసీరోడ్లు నిర్మాణం, రోడ్లు, ఖాళీ తదితర స్థలాల్లో మొక్కలు నాటాలని, పాత భవనాల కూల్చివేత, పాడు బావుల పూడిక వంటి ఎన్నో అంశాలపై సభ్యులు చర్చించి పలు తీర్మాణాలను చేపట్టారు.
మున్సిపల్ పరిధిలోని 33 వెంచర్లలలో కేటాయించబడ్డ ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కమిషనర్ నాగరాజును ఆదేశించారు. ఫెన్సింగ్ వేయడంతో పాటు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంజూరు కాబడ్డ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయలన్నారు. అనంతరం మిషన్ భగీరథ ఏడీ శషాంక్ మిశ్ర, ఏఈతో మాట్లాడి పనులపై ఆరా తీశారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పనులు నిర్వహించాలని, నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణితో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.