వికారాబాద్ (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద ఏఎన్ఎం, ఆశవర్కర్లను ఏర్పాటు చేసి ప్రతి రోజూ విద్యార్థులకు ఫీవర్ చెక్ నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ కె.నిఖిల జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. డీపీఆర్సీ భవనంలో జిల్లా అధికారులతో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో థర్మల్ స్కానర్ ఉంచాలని, ప్రతి విద్యార్థికి గేట్ వద్ద జ్వర పరీక్ష నిర్వహిస్తే కొవిడ్ను నియంత్రించవచ్చన్నారు. జ్వరం ఉన్న విద్యార్థులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి, కొవిడ్ లక్షణాలు ఉంటే ఆ విద్యార్థిని వారి ఇంటి వద్ద ఐసొలేషన్లో వైద్య సేవలు అందించాలని సూచించారు.
జిల్లాకు మంజూరైన ఆర్టీపీసీఆర్ సెంటర్ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వీటిని కొనుగోలు చేయాలని సూచించారు. వానకాలం సీజన్కు రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతు బంధు పథకం ప్రతి రైతుకు అందేలా చూడాలన్నారు. జిల్లాలోని 1196 చెరువులు, ప్రాజెక్టుల కింద ఆయకట్టు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. జిల్లాలో గొరెల పెంపకం కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు సకాలంలో స్కాలర్ షిప్లు అందేలా చూడాలన్నారు. జిల్లాలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాలలు, పాఠశాలల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు రోజు వారీగా చేపట్టిన పనులను నిర్ణీత ఫార్మాట్లో ప్రతి రోజూ తన వాట్సాప్కు పంపించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యుత్, హర్టికల్చర్, మైన్స్ తదితర శాఖలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకీ రెడ్డిలతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
వేగంగా పనులు పూర్తి చేయాలి
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలు, పల్లెప్రగతి వనం పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. డీపీఆర్సీ భవనంలో పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనుల పురోగతిపై స్పెషల్ ఆఫీసర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, పల్లె ప్రగతి వనాల వద్ద మొక్కలు నాటి గ్రీన్ ఫెన్సింగ్ చేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే అన్నింటికీ నీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. పల్లె ప్రగతి లేని గ్రామాలకు స్థల సేకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలని తాసిల్దార్లను ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం కూడా పది ఎకరాలకు తగ్గకుండా స్థలం సేకరించాలన్నారు.
గ్రామం ప్రధాన రహదారులకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటి గ్రామాల రూపురేఖలు మారిపోయేలా చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా రెండు వరుసల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలని సూచించారు. చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కృష్ణన్, జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా, జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవ్లతో పాటు స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.