కులకచర్ల : జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధికి డీసీసీబీ ద్వారా కృషిచేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం కులకచర్ల రైతు వేదిక భవనంలో డెయిరీ ఉత్పత్తిపై రైతులకు డీసీసీబీ బ్యాంకు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీసీసీబీ ద్వారా ముందుగా వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలాన్ని మోడల్గా చేసి విడుతలవారీగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
డీసీసీబీ ద్వారా మరింత ప్రోత్సాహం
ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం కల్పిస్తున్నదని, డీసీసీబీ ద్వారా మరింత ప్రోత్సాహం అందించేందుకు తమవంతు కృషిచేస్తామని తెలిపారు. దీనికిగాను గ్రామాల్లోని మహిళా సంఘాల్లో ఉన్న పాడి, అర్హత ఉన్న మహిళలు ఐదుగురితో జేఎల్జీ గ్రూపుగా తయారుచేసి వారికి డీసీసీబీ ఆధ్వర్యంలో నాబార్డుద్వారా పశువులను కొనుగోలు చేసేందుకు రుణాలు అందజేస్తామని తెలిపారు. అర్హుల జాబితాను తయారు చేసేటప్పుడు వారు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించినవారికి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కులకచర్ల మండలంలో విజయవంతం చేయాలని రైతులను కోరారు. పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు రైతులకు వ్యవసాయంతోపాటు అదనంగా పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు డీసీసీబీ ద్వారా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
పాల ఉత్పత్తి రుణాలకు సబ్సిడీ ఉండదు
డీసీసీబీ ద్వారా పాల ఉత్పత్తికి అందజేస్తున్న రుణాలకు ఎలాంటి సబ్సిడీ ఉండదని, తీసుకున్న రుణాలు వాయిదాల ప్రకారం చెల్లించాలన్నారు. రుణాలు అందించేందుకు ప్రజాప్రతినిధులు అర్హత ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఖాదీ బోర్డు ద్వారా జిల్లాలో వివిధ రకాల రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదన్నారు. స్త్రీలకు 35శాతం, పురుషులకు 25శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సుధాకర్రెడ్డి, రాంరెడ్డి, అధికారులు షఫీ, శైలజ, పీఏసీఎస్ డైరెక్టర్లు, వివిధ గ్రామాల రైతు బంధు సమితి అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.