షాద్నగర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బీష్వమాధవి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలకు అతీతంగా ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. మన భూముల ధరలు పెరుగుతున్నందున్న ఎట్టి పరిస్థితిలో భూములను అమ్ముకొవద్దని సూచించారు.
గ్రామంలో పల్లె ప్రగతి పనులు బాగున్నాయని కితాబిచ్చారు. పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, ఎస్సీ కమ్యూనిటీ భవనం వంటి నిర్మాణాలు ఆదర్శనీయమని కొనియాడారు. గ్రామంలో విసృతంగా చెట్లను నాటడడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, కమ్యూనిటీ భవనాలు, మిషన్ భగీరథ నీళ్ల ట్యాంక్లను మండల గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
గ్రామ మహిళల శ్రేయస్సుకోసం గ్రామంలో మహిళా సంఘం భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తు పత్రాలను మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ బీష్వ రామకృష్ణ, ఉప సర్పంచ్ నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, ఎంపీడీవో శరత్చంద్ర, ఎంఈఓ శంకర్ రాథోడ్, పంచాయతీ రాజ్ ఈఈ చిరంజీవులు, నాయకులు పాల్గొన్నారు.