ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్ చింతల్ బస్తీ (విజయ డెయిరీ సమీపంలో)లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా మొబైల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒకటని అన్నారు. స్థానిక ఆశా వర్కర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు.
దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మెరుగ్గా జరుగుతోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడే కరోనా మహమ్మారిని తరిమివేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వ్యాక్సిన్ తీసుకుని మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.