షాబాద్ : గిరిజన తండాలు, దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక మార్పులో భాగంగా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వారి కోసం వివిధ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారని తెలిపారు.
అందులో భాగంగా దళిత వాడాల్లో, ఎస్టీ తండాల్లో డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, విధి దీపాలు, కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని ప్రాంతాలతో సమానంగా దళిత వాడలు, ఎస్టీ తండాలు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని మంత్రి పేర్కొన్నారు. ఆ దిశలో కలెక్టర్లు చొరవ చూపి, క్షేత్ర స్థాయిలో వారి అవసరాలు గుర్తించి, ప్రతిపాదనలు పంపాలని తద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.