షాబాద్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలో దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు పథకాలు అమలు చేస్తున్న సర్కార్ పేదలకు అండగా నిలుస్తున్నది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది. దళితబంధు పథకం ప్రారంభం కావడంతో దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 2లక్షల వరకు దళిత కుటుంబాలు ఉంటాయి.
ఒక్కొ నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేసి రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టడంతో చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్ డివిజన్లలో దళితులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.