రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : పంట రుణాల మాఫీ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నెలాఖరులోగా రూ.50 వేలలోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రూ.50 వేలలోపు పంట రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ట్రెజరీకి పూర్తి బిల్లులను కూడా సమర్పించింది. శనివారం నాటికి రూ.45 వేలలోపు రుణాలకు సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాల్లో ట్రెజరీ శాఖ నుంచి నేరుగా జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో రూ.50 వేలలోపు రుణాల మాఫీతో జిల్లాలోని 24,013 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఈ రుణాలు ఒకట్రెండు రోజుల్లో పూర్తిగా మాఫీ కానున్నాయి. ఇప్పటికే మాఫీ అయిన రూ.25 వేలలోపు పంట రుణాలతో 10,940 మంది రైతులకు లబ్ధి చేకూరింది. రూ.లక్షలోపు పంట రుణాలు పొందిన రైతులు 1.47 లక్షల మంది ఉండగా, రూ.25 వేలలోపు రుణమాఫీ పూర్తికాగా, రూ.50 వేలలోపు రుణాలు ఒకట్రెండు రోజుల్లో మాఫీ కానున్నాయి. మూడో దఫాలో రూ.75 వేలలోపు రుణాలు, తదనంతరం లక్షలోపు రుణాలను చివరి దఫాలో మాఫీ చేస్తారు. జిల్లాలో రూ.లక్షలోపు రుణాలు రూ.300 కోట్లు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
మొదటి రుణ మాఫీ మూడేండ్లలోనే పూర్తి..
జిల్లాలో మొదటి దఫా రుణమాఫీకి సంబంధించి నాలుగేండ్లలో చేయాల్సిన రుణమాఫీని మూడేండ్లలో పూర్తి చేసి రైతు ప్రభుత్వంగా నిలిచింది. తొలి విడుత రుణమాఫీ ప్రక్రియతో జిల్లాలోని 1.50 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. మరోవైపు జిల్లాలోని సహకార బ్యాంకు బ్రాంచుల్లో రూ.50 వేలలోపు రుణాలు పొందిన రైతులకు సంబంధించి 11,313 మంది ఉండగా, రూ.40.56 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రూ.లక్షలోపు రుణాలు రూ.202 కోట్లకుగాను, 44,487 మంది రైతులు ఉండగా, వీరిలో రంగారెడ్డి జిల్లాలో 18,173 మంది రైతులకు రూ.86.91 కోట్లు రూ.లక్షలోపు పంట రుణాలున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.25 వేలలోపు రుణాలకు సంబంధించి రూ.7.34 కోట్ల రుణాలు మాఫీ కాగా, 5094 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. రంగారెడ్డి జిల్లాలో రూ.25 వేలలోపు రుణాలు పొందిన రైతులు 1981 మంది ఉండగా రూ.3.59 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. రూ.75 వేలలోపు రుణాలు పొందిన రైతులు 7371 మంది ఉండగా రూ.47 కోట్లు పంట రుణాలు పొందారు. రూ.75 వేల నుంచి రూ.లక్షలోపు పంట రుణాలు పొందిన రైతులు 10,490 మంది ఉండగా రూ.97.50 కోట్ల రుణాలున్నాయి.
రెండు విడుతల రుణమాఫీ పూర్తి
టీఆర్ ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా టీఆర్ ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ ప్రక్రియను చేపట్టి నాలుగేండ్లలో చేయాల్సిన రుణమాఫీని కేవలం మూడేండ్లలో పూర్తి చేసి రైతు ప్రభుత్వంగా పేరు సంపాదించుకుంది. అప్పుల్లో కూరుకుపోయిన రైతులను తొలుత అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం మరోసారి రుణాలను మాఫీ చేస్తున్నందుకుగాను రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క రుణమాఫీయే కాదు, అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతు బంధు, రైతు ఏ విధంగా మరణించినా సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను రైతు బీమా వంటి రైతు సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తుండడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.50 వేలలోపు రెండో విడుత పంట రుణాల మాఫీ ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పూర్తి కానుంది.