కడ్తాల్ : మండల కేంద్రం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. ఎస్ఐ హరిశంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన ఖాజామొయినోద్దీన్ తన డీసీఎంలో లక్ష్మమ్మ, బాబమ్మ, వెంకటేశ్లతో కలిసి కూరగాయాలను తీసుకుని, గురువారం తెల్లవారుజామున మక్తమాదారం నుంచి హైదారబాద్లోని కొత్తపేట్ మార్కెట్కి బయల్దేరాడు. డీసీఎం కడ్తాల్ శివారులోని ముచ్చర్ల గేట్ వద్దకి రాగానే, కడ్డీల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఖాజామొయినోద్దీన్ అక్కడిక్కడే మృతి చెందగా, డీసీఎంలో ఉన్న ముగ్గురికి గాయలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకి తరలించామని తెలిపారు. మృతుడి సోదరుడు నజీరుద్ధీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలావుండగా ప్రమాద ఘటనలో డీసీఎంలో ఇరుక్కుపోయి మృతి చెందిన ఖాజామొయినోద్దీన్ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు ఇబ్బందులు పడ్డారు. మృతదేహాన్ని డీసీఎం లోపలి నుంచి క్రేన్ సహాయంతో బయటకు తీశారు.
ఎమ్మెల్సీ పరామర్శ…
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుడి కుటుంబాన్ని గురువారం మధ్యాహ్నం మక్తమాదారం గ్రామంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ. 4,500 ఆర్థిక సాయం ఎమ్మెల్సీ అందజేశారు. రాధాకృష్ణ ట్రస్ట్ తరుపున చైర్మన్ దశరథ్ నాయక్ రూ. 5వేలు, మక్తమాదారం గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబానికి రూ. 7వేలు ఆర్థిక సాయం అందజేశారు. పరామర్శించిన వారిలో జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్ సులోచన, ఎంపీటీసీ మంజుల, నాయకులు సాయిలు, చంద్రమౌలి, నర్సింహగౌడ్, హన్మానాయక్, డాక్టర్ శ్రీనివాస్, నర్సింహ, బాల్రాజ్, చెన్నయ్య, నాయకులు పాల్గొన్నారు.