తుర్కయాంజల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా, ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ అధికారి స్రవంతిపై సస్పెన్షన్ వేటు పడింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమ్మగూడ గ్రామం సర్వే నంబర్ 253, 254లో ఓ భవన నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమ్మగూడ రెవెన్యూ పరిధి 18వ వార్డులోని సర్వే నంబర్ 253, 254లో ప్లాట్ నంబర్ 18లో 1000 గజాల స్థలానికి గాను థామస్ మరియమ్మ గువ్వల మరికొంతమంది 299 గజాలకు జీ ప్లస్ త్రీ భవన నిర్మాణానికి 6 మే 2021న టీఎస్ బీపాస్ ఆన్లైన్ ద్వారా మున్సిపాలిటీ నుంచి అనుమతి పొందారు.
తరువాత ఇదే ప్లాట్ పై కమిషనర్ 1000 గజాలకు జీ ప్లస్ ఫోర్గా మార్చి మ్యానువల్గా అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇదే అనుమతి పై రాగన్నగూడ 8వ వార్డులో సర్వే నంబర్ 489లో ఇదే వ్యక్తులు 743 గజాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నారు. ఒక్క అనుమతితో వేర్వేరు చోట్ల ఏకకాలంలో రెండు భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించిన 18వ వార్డు కౌన్సిలర్ సునీల్ 9 ఆగస్టు 2021న జిల్లా అడిషనల్ కలెక్టర్కు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. అదే రోజు కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లాకు షోకాజు నోటీసులు రాగా మరుసటి రోజు అప్పటి టీపీఓ స్రవంతికి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో భవన అనుమతుల్లో జరిగిన అవకతవకలపై కలెక్టర్ ఇరువురిని వివరణ కోరగా వారి వివరణపై సంతృప్తి చెందని కలెక్టర్ అమయ్కుమార్ ఇరువురిని సస్పెన్షన్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ సస్పెన్షన్ మున్సిపాలిటీలో చర్చనీయంశంగా మారింది.