అబ్దుల్లాపూర్మెట్ : కరోనా మహమ్మారి గ్రామాల్లో మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన పెరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లిలో 20రోజుల వ్యవధిలోనే కరోనాతో నలుగురు చనిపోయారు. అనేక మంది కరోనా బారీన పడడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించి పది రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు ఉదయం 6నుంచి 10గంటల వరకు సడలింపు ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ దూసరి సుజాత యాదయ్యగౌడ్ మాట్లాడుతూ గ్రామ పరిసరాల్లో చిన్న చిన్న కంపెనీలు ఉండడం, ఇతర రాష్టాల వారు నిత్యావసర సరుకులు తీసుకెళ్లడం వల్ల కరోనా విజృంభిస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పది రోజుల పాటు విధించిన లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించి కరోనాను తరిమికొట్టేందుకు సహాకరించాలని కోరారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే..
కవాడిపల్లిలో కరోనా కేసులు పెగుతున్నాయని తెలుసుకున్న కొవిడ్ జిల్లా వైద్యాధికారి జనార్దన్, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి శ్వేత బుధవారం సిబ్బందితో గ్రామానికి చేరుకొని ఇంటింటి జరసర్వే నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ర్యాపిడ్ యాంటీజన్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి 130మందికి పరీక్షలు చేయడం జరిగిందన్నారు. అందులో 8మందికి పాజిటీవ్ వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులు పంచాయతీ విధించిన లాక్డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పాజిటీవ్ వచ్చిన వారు బయటకు రాకుండ ఇంట్లోనే ఉండి క్రమం తప్పకుండ మందులు వాడాలని సూచించారు. లాక్డౌన్ సడలింపు సమయంలో బయటకు వచ్చే వారు మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్లు ఉపయోగించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే కేసులు పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ కొలన్ శ్రీధర్రెడ్డి, ఉప సర్పంచ్ పన్నాల మోహన్రెడ్డి, సిహెచ్ఓ వెంకట్రెడ్డి, హెచ్ఈఓ వెంకటాచారి, సూపర్వైజర్ చంద్రశేఖర్, పంచాయతీ వార్డు సభ్యులు, ఏఎన్ఎం మంజుల ఉన్నారు.