రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో అడవులు ఆకుపచ్చ చీరను అలంకరించుకున్నాయి. వాగులు వంకలు నీటితో ఉరకలేస్తూ జలకళను సంతరించుకున్నాయి. అడవుల్లో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కొండలపై నుంచి లోయల్లోనికి జాలువారుతున్న నీరు తెల్లని నురగలా కనువిందు చేస్తున్నది.
ఇచ్చోడ, సెప్టెంబర్ 30: అందంగా.. ఆహ్లాదంగా కనిపించే అడవులు.. ఎత్తైన కొండలు.. గుట్టలు.. పచ్చని మైదానం.. పక్షుల కిలకిలరావాల నడుమ 350 అడుగుల ఎత్తు పైనుంచి జాలువారే జలపాతం గాయత్రి.. పర్యాటకులను ఇట్టే కట్టి పడేస్తూ కనువిందు చేస్తున్నది. జారి పడే నీటి ధ్వని మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. ఇక్కడి జలపాతంపై ఒక్కోసారి కింద భాగంలో ఇంద్రధనుస్సు ఆకారం ఆవిష్కృతమవుతున్నది. సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నంత సేపు ఈ అద్భుతం అలాగే ఉంటుంది. మబ్బులు పడితే మాయమైపోతుంది. ఈ సుందర దృశ్యం పర్యాటకుల సెల్ఫోన్లు, కెమెరాల్లో బందీగా మారుతుంది.
ఇలా వెళ్లాలి..: ఇచ్చోడ మండల కేంద్రం నుంచి సిరిచెల్మ వెళ్లే మార్గంలో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాక మేడిగూడ గ్రామం వద్ద గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాల వస్తుంది. అక్కడి నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో గుండివాగు అనే గిరిజన కుగ్రామం ఉంది. అనంతరం దట్టమైన అడవి మార్గం ఉంటుంది. ప్రస్తుతం ఎర్రమట్టి రోడ్డు వేశారు. జలపాతానికి సుమారు 100 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేయాలి. అక్కడి నుంచి కాలినడకన ప్రయాణించాలి. అప్పుడే సుందరమైన గాయత్రి జలపాతం దర్శనమిస్తుంది. ఈ గాయత్రి జలపాతాన్ని ముక్తిగుండం అని కూడా స్థానికులు పిలుస్తుంటారు.
కాసిపేట, సెప్టెంబర్ 30 : ప్రకృతి సోయగాల నడుమ ఉన్న సాలేగూడ జలపాతం సందర్శకులను కట్టిపడేస్తున్నది. సహజంగా గుట్టలపై నుంచి జారే తెల్లటి పాలలా నీటి ప్రవాహం పడుతూ అద్భుతంగా కనిపిస్తున్నది. ఇక్కడే రెండు వాటర్ ఫాల్స్ తయారు కావడంతో ఇటీవల వాటిని చూసేందుకు జనం తరలివెళ్లి అక్కడే కుటుంబంతో సేద తీరుతున్నారు. ఎటువంటి ప్రమాదస్థాయి ప్రాంతం కాకపోవడంతో వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.
ఇలా వెళ్లాలి.. : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని గట్రావ్పల్లి పరిధిలోని సాలేగూడ అటవీ శివారులో ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బెల్లంపల్లి లేదా మంచిర్యాల వైపు నుంచి వచ్చే వారు సోమగూడెం నుంచి కాసిపేట మీదుగా కొండాపూర్ యాప చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి సోనాపూర్ మీదుగా సాలేగూడకు చేరుకోవచ్చు. దీంతోపాటు కాసిపేట నుంచి దేవాపూర్ మీదుగా కూడా గట్రావ్పల్లి మీదుగా సాలేగూడకు రావచ్చు. సాలేగూడ గ్రామం నుంచి రెండు కిలో మీటర్ల మేర అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలు కొంత దూరం మేరకే వెళ్తాయి. అర కిలో మీటరు నడవాల్సి ఉంటుంది.
మామడ, సెప్టెంబర్ 30: నిర్మల్ జల్లా మామడ మండలంలోని వాస్తాపూర్ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య 25 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతూ పాలధారను మరిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా పర్యాటకుల రద్దీ పెరిగింది. జలపాతాన్ని వీక్షించేందుకు వస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారితో సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో వచ్చి గంటల తరబడి సరదాగా గడుపుతున్నారు.
ఇలా వెళ్లాలి.. : నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్ వెళ్లే హైవే నుంచి ఇక్కడకు చేరుకోవచ్చు. కొండాపూర్ హైవే మేడిపల్లి, బూరుగుపల్లి, మొండిగుట్ట, తాండ్ర గ్రామాల మీదుగా కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. దారి పొడవునా ఘాట్రోడ్డులో ప్రకృతి అందాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదార జలపాతం దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి జాలు వారుతున్నది. కొండల పైనుంచి బండ పరుపుగా ఉన్న రాళ్లపై తెల్లటి నురగ వలె ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
ఇలా వెళ్లాలి.. : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణించి తిర్యాణి మండల కేంద్రానికి చేరుకోవాలి. అక్కడి నుంచి 15 కిలోమీటర్లు బస్సు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి మాదారం గ్రామానికి వెళ్లొచ్చు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ అడవుల్లో మిట్టె జలపాతం ఉంది. దీనినే సప్త గుండాలు అని కూడా పిలుస్తారు. ఇక్కడి అడవుల్లో ఒకదాని తరువాత ఒకటి ఏడు జలపాతాలు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతారు.
ఇలా వెళ్లాలి.. : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో మిట్టె జలపాతం ఉంది. జిల్లా కేంద్రం నుంచి లింగాపూర్ వరకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో పిట్టగూడ వరకు వెళ్లాలి. ఈ గ్రామం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు అడవిలో నడిచి వెళ్లాలి. మొదట పది అడుగుల ఎత్తు నుంచి జాలువారే పెద్ద మిట్టె వస్తుంది. తరువాత 80 అడుగుల ఎత్తు నుంచి జాలువారే రెండో మిట్టె కనువిందు చేస్తున్నది.
నార్నూర్, సెప్టెంబర్ 30: ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో మైసమాల్ జలపాతం ఉంది. వానకాలంలో నిండుగా జాలువారుతుంది.
ఇలా వెళ్లాలి..: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి లోకారి(కే)కు వెళ్లాలి. సుమారు 140 కి.మీ. ప్రయాణించాలి. అనంతరం ఝరికి చేరుకోవాలి. ఈ గ్రామ సమీపంలోనే మైసమాల్ జలపాతం ఉంటుంది. బస్సు, ప్రైవేటు వాహనాల సౌకర్యం ఉంటుంది.
భీంపూర్, సెప్టెంబర్ 30 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుంజాల జలపాతం చిన్నదే అయినా చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం భీంపూర్కు ఐదు కిలోమీటర్లు, కొలాంల ఆవాసం గుంజాలకు కిలోమీటర్ దూరంలో ఉన్నది. మహారాష్ట్ర నుంచి వచ్చే వాగు భీంపూర్ మండలం ధనోరాలోని గుండా గుంజాల పక్క నుంచి వెళ్లి పెన్గంగలో కలిసిపోతుంది. తాంసి మండలంలో ఉన్నప్పుడు ఈ జలపాతాన్ని టూరిజం స్పాట్గా గుర్తించాలని అప్పటి ఎంపీడీవో ఆకుల భూమయ్య ప్రతిపాదనలు పంపారు. ఇక్కడి చేలల్లో పనిచేసే రైతులు మధ్యాహ్నం వేళ జలపాతం అందాలను ఆస్వాదిస్తూ చద్దులు తింటారు.
బోథ్, సెప్టెంబర్ 30: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని పొచ్చెర జలపాతం పర్యాటకులకు కను విందు చేస్తున్నది. జాలువారే నీటి ఒయలతో ఆకట్టుకుంటున్నది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండడంతో భారీసంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వచ్చి జలపాతం అందాలను వీక్షిస్తూ సేదతీరుతున్నారు. జల పాతంతోపాటు చెట్టు వేర్ల నుంచి పుట్టుకొచ్చిన విధంగా తయా రు చేసిన వనదేవత విగ్రహం, పక్కనే గాయత్రీ మాత విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. వచ్చిన వారు సేద తీరేం దుకు వీలుగా వన కుటీరాలు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా బల్లలు బిగించారు. చెట్ల కింద సేద తీరేందుకు వీలుగా సిమెంట్ దిబ్బలు కట్టించారు. వీఐపీల కోసం విశ్రాంతి భవనం ఉంది
ఇలా వెళ్లాలి..: ఈ జలపాతం చూడాలనుకునే పర్యాటకులు 44వ నంబర్ జాతీయ రహదారిలో బోథ్ క్రాస్ రోడ్డుకు చేరుకోవాలి. అక్కడి నుంచి 4.50 కిలోమీటర్లు ప్రయాణిస్తే జలపాతం చేరుకోవచ్చు.టర్లు ప్రయాణిస్తే జలపాతాన్ని చేరుకోవచ్చు.
బజార్హత్నూర్, సెప్టెంబర్ 30: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని కడెం నదిపై కనకాయ జలపాతం కనువిందు చేస్తున్నది.దట్టమైన అటవీప్రాంతంలో పక్షుల కిలకిలరావాల నడుమ ఎత్తైన ప్రదేశాల నుంచి జాలువారుతుంది.
ఇలా వెళ్లాలి..: బజార్హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బలన్పూర్ గ్రామసమీపంలోని అటవీప్రాంతంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి బజార్హత్నూర్ మండలానికి చేరుకోవాలి. ఆర్అండ్బీ రహదారి గుండా బలన్పూర్ గ్రామసమీపంలోని కనకదుర్గ దాబా వద్ద నుంచి 3కిలో మీటర్లు కాలినడకన ఈ జలపాతనికి చేరుకోవచ్చు.
నేరడిగొండ, సెప్టెంబర్ 30 నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామంలో ఉంది. జిల్లా కేంద్రం నుంచి నేరడిగొండకు ఆర్టీసీ బస్సుల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి 13 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుంటాల జలపాతానికి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాల జలపాతం నీటి ప్రవాహంతో జలకళ సంతరించుకున్నది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో కొండపైనుంచి జాలువారుతున్న నీరు కొత్త అందాలను తీసుకొస్తున్నది. దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి పాల నురుగుల వలె జాలువారుతూ ఆహ్లాదం నింపుతున్నది.
ఇలా వెళ్లాలి.. : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిర్యాణి మండల కేంద్రానికి వెళ్లాలి. ఇక్కడి నుంచి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న రోండపల్లి గ్రామం వరకు బస్సులో చేరుకోవాలి. అక్కడి నుంచి దాదాపు 9 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే వస్తున్నది.
నార్నూర్, సెప్టెంబర్ 30 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో పారేఖాతి జలపాతం ఉంది. ఈ జలపాతం చుట్టు పక్కల పచ్చదనంతో కళకళలాడుతున్నది. గుహపై నుంచి పడుతున్న నీటి ప్రవాహం కనువిందు చేస్తున్నది.
ఇలా వెళ్లాలి..: ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ ఎక్స్రోడ్డుకు రావాలి. ఎక్స్రోడ్డు నుంచి మాన్కాపూర్ గ్రామానికి 25 కిలోమీటర్లు ప్రయాణించాలి. అక్కడి నుంచి రెండు కిలో మీటర్లు వెళ్తే పారేఖాతి జలపాతాన్ని తిలకించవచ్చు. బస్సు సౌకర్యంతో పాటు ప్రైవేట్ వాహనాల సౌకర్యం ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి జలపాతానికి వెళ్లాలంటే 108 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
కెరమెరి, సెప్టెంబర్ 30 : చుట్టూ పచ్చని అడవులు.. మధ్యలో పెద్ద లోయ.. సుమారు 110 అడుగుల కిందికి దూకే జలధారలు.. ఈ చూడముచ్చటైన బాబేఝరి జలపాతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పర్యాటక ప్రాంతమైన జోడెఘాట్కు వెళ్లే రహదారి పక్కన ఉంటుంది. హట్టి గ్రామం నుంచి జోడెఘాట్కు వెళ్లే మార్గం మధ్యలో కనిపిస్తున్నది. సుమారు 10.6 కిలో మీటర్ల దూరం ఉంటుంది. హట్టి నుంచి పిట్టగూడ, టోకెన్మోవడ్, బాబేఝరి మీదుగా కొద్ది దూరంలో మూలమలుపు రాగానే ఈ స్పాట్కు చేరుకోవచ్చు. రోడ్డు నుంచి కేవలం 25 మీటర్ల దూరం కాలినడకన వెళ్తే ఇది కనిపిస్తున్నది.
నార్నూర్, సెప్టెంబర్ 30 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో గుండాయి జలపాతం ఉంది. ఎత్తైన రాళ్ల పైనుంచి నీటి ప్రవాహం తెల్లటి పాలధారలా జాలువారుతూ కనువిందు చేస్తున్నది.
ఇలా వెళ్లాలి..: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 130 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మొదట జిల్లా కేంద్రం నుంచి 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న నార్నూర్ మండల కేంద్రానికి చేరుకోవాలి. ఈ జలపాతం మండలంలోని గుండాల-నడ్డంగూడ గ్రామ సమీప ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి ఉట్నూర్ ఎక్స్రోడ్డు. అక్కడి నుంచి నార్నూర్కు రావాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి లోకారి(కే) మీదుగా ఈ జలపాతానికి చేరుకోవచ్చు. బస్సు, పైవేట్ వాహనాల సౌకర్యం ఉంటుంది.