ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
పేదలకు రంజాన్ కిట్ల పంపిణీ
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ము స్లింలకు అండగా ఉంటుందని, వారి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పేద ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వారి పండుగలను ఘనంగా జరుపుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని చెప్పారు. అందుకే రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పేద ముస్లింలు, క్రైస్తవులకు కొత్త బట్టలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈద్గాలు, మసీదుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వసతులు కల్పిస్తున్నదన్నారు. జిల్లాలో 1500మందికి ప్రభుత్వం రంజాన్ కిట్లు అందిస్తున్నట్లు వివరించారు. కొవిడ్ నిబంధనల నడుమ రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరారు. కరోనా వైరస్ను తట్టుకునేందుకు 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకా వేసుకోవాలని కోరారు.
మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీపీ మందల లావణ్య, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.కరీం, పట్టణ అధ్యక్షుడు బాబుమియా, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రహీం, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ కుమార్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బుర్ర రమేశ్, అక్బర్, బాబర్ పాల్గొన్నారు.