షాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల్లో సమూల మార్పులు జరుగుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మునిసిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జల్పల్లి మునిసిపాలిటీకి ప్రతి నెల రూ. 48లక్షలు నిధులు వస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది జీతాలతో పాటు, చెత్త వాహనాల కొనుగోలు తదితర వాటికి నిధులు వినియోగించడం జరుగుతుందన్నారు. మునిసిపాలిటీలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీల నిర్మాణానికి రూ. 17కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
పార్టీలకతీతంగా కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుని జల్పల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. స్వచ్ఛ జల్పల్లిగా మార్చేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. జల్పల్లి చెరువుకు రూ. 9.50కోట్లు నిధులు మంజూరు చేశామని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. వైరల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పహడిషరీఫ్ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిన్నట్లు చెప్పారు. మున్సిపాలిటీలోని అన్ని పాఠశాలలకు తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 50లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. చెరువు ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన బడ్జెట్ను పాలకవర్గం ఆమోదించింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాధి, వైస్ చైర్మన్ ఫర్హాన నాజ్, మున్సిపల్ కమిషనర్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.