బంట్వారం : భూమి కదిలిందని భయందోళనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం సుమారు 2నుంచి 3 గంటల మద్యన భూమిలోంచి కొద్ది సేకండ్ల పాటు శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. బోరు మోటరు డ్రిలింగ్ చేసినట్లు ఐదారు సెకండ్ల పాటు వచ్చి, ఒక్కసారిగా కదిలింద(ఊపింది)ని బొపునారంలో మేస్త్రీ సుభాశ్ తెలిపారు. దీని ప్రభావం తొరుమామిడి, బస్వపూర్, బండమీదిపల్లితో పాటు కర్ణాటక గ్రామాలు కుంచావరం, పోచారం, మగ్దంపూర్, జిల్వార్శా తదితర పరిసరాల్లో కొద్దిగా ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
అయితే ఏదైన మైనింగ్ సౌండ్ అయి ఉంటుందని కొందరు అంటుండగా, కాదు భూ కంపం ప్రభావామే మరికొందరు అంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని కర్చికెడ్ గ్రామాల పరిధిలో భూమి నుంచి శబ్దాలు వస్తున్నాయి. అంతే తరుచుగా భూమిలోంచి శబ్దాలు రావడం పట్ల అక్కడి కలబురగి (గులబర్గా) జిల్లా అధికారులు ఆయా గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అప్పట్లో అక్కడి భూ కంపనాల ప్రభావం తెలంగాణలోని తాండురు పరిసరాల్లో సైతం ఉందని అధికారులు ప్రకటించారు. శనివారం వచ్చింది భూ కంప ప్రభావమే అని ప్రజలు చర్చించుకుంటున్నారు.