ఆమనగల్లు : ఆమనగల్లు తాసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఇన్చార్జి ఆర్డీవో వెంకటాచారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రోజువారి విధులు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పని తీరును ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కార్యాలయంలో విధులు నిర్వహించాలని, విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే రైతులు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయకుండా విధులు చేపట్టాలని వారికి సూచనలు చేశారు.
ఇటీవల తాసీల్దార్ చందర్రావు పీటీ సర్టిఫికేట్ జారీ విషయంలో ఏసీబీకి పట్టుబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమన్వయంతో కార్యాలయం సిబ్బంది విధులు చేపట్టి ప్రజల నుంచి మన్ననలు పొందాలని ఆయన కోరారు. భూముల క్రయివిక్రయాల్లో స్లాట్ బుక్ చేసుకొన్న రైతులకు ఇబ్బందులు గురి చేయకుండా రిజిస్ట్రేషన్ల చేసి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఉన్న మీసేవా కేంద్రాన్ని తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు.