ఇబ్రహీంపట్నం : నిరుద్యోగ యువతీ యువకులు పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు వెలితే రానున్న ఉద్యోగాల భర్తిలో ఉద్యోగం సాధించడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ బత్తుల శివధర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎంకేఆర్ ఫౌండేషన్ను స్థాపించి ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం మూడోవిడుత ఉచిత కానిస్టేబుల్ శిక్షణను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన శిక్షణలో సుమారు 386మంది ఉద్యోగాలు సాధించడం చాలా గొప్ప విషయమన్నారు.
ఎంతోమంది పేద కుటుంబాలకు చెందినవారు, రైతు కుటుంబాలకు చెందినవారు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. తానుకూడా ఒకరైతు కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి ఐపీఎస్ సాధించానని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకెల్లాలని అన్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగాలు లభించక ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారని వీరందరికీ అర్హత ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఉద్యోగాలకు దూరంగా ఉన్నారన్నారు. ఈ పరిస్థితిలో ఎంకేఆర్ ఫౌండేషన్ను స్థాపించి ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇప్పించి ప్రభుత్వ ఉద్యోగం అందించేందుకు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. ఆయన శ్రమ వృథా కాలేదని, ఆయన చేసిన కృషి వలనే ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు సాధించారన్నారు.
ఈ మూడో విడుతలోనూ శిక్షణకు వచ్చిన యువతీ, యువకులు పట్టుదల, క్రమశిక్షణే ధ్యేయంగా ముందుకెల్లి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఎంకేఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఈ ఫౌండేషన్ను స్థాపించామని పేర్కొన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 386 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని వారంతా ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నారని వారంతా సంతోషంగా ఉన్నామని చెప్పడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. మూడోవిడుతలో ఉచిత పోలీసు ఉద్యోగాల శిక్షణకోసం 704మంది అభ్యర్థులు ఎంపికయ్యారని వీరందరికి రెండు విడుతల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి విడుతలో శారీరక పరీక్షలు, రెండో విడుతలో వ్రాత పరీక్షలుంటాయని అన్నారు.
ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఎంతో నైపుణ్యత కలిగిన వ్యక్తుల చేత శిక్షణ ఇప్పిస్తున్నమని చెప్పారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ఈ ప్రాంత ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్జైన్, మార్కెట్కమిటి మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేష్, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, ఏసీపీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్, మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్, ప్రముఖ వ్యక్తిత్వ నిపుణులు గంగ నాగేశ్వరరావు, సీఐ సైదులు, ఎంకేఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జెర్కోని రాజు, సభ్యులు మైలారం విజయ్కుమార్, మడుపు శివసాయి, రాజ్కుమార్, వీరేశ్, భగీరత్, శ్రీకాంత్, ప్రవీణ్, గణేశ్ పాల్గొన్నారు.