రంగారెడ్డి, అక్టోబర్ 1, (నమస్తే తెలంగాణ): తెలంగాణ అంతటా పచ్చదనం పరిఢవిల్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ప్రతీ మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రధానంగా యాదాద్రి ఫారెస్ట్ మోడల్ను ప్రతీ మండలంలో ఐదు చిట్టడవులను సృష్టించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు పూర్తికాగా, మండలానికో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ మండలంలో ఐదు నుంచి పది ఎకరాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాలను నిర్మిస్తున్నారు. ప్రతీ బృహత్ పల్లెప్రకృతి వనంలో 20-30 వేల మొక్కలను నాటుతున్నారు. నీడనిచ్చే మొక్కలతోపాటు పూలు, పండ్లు, ఔషధ మొక్కలను నాటుతున్నారు. జిల్లాలోని గ్రామీణ మండలాలైన 21 మండలాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. వీటిలో ఇప్పటికే మోడల్గా ఏర్పాటు చేసిన నందిగామ మండలంతోపాటు చేవెళ్ల, శంషాబాద్, యాచారం, కేశంపేట మండలాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా మండలాల్లో మరో పదిహేను రోజుల్లోగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
మోడల్ బృహత్ వనం చేగూరు…
నందిగామ మండలంలోని చేగూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం జిల్లాలోనే మోడల్గా ఏర్పాటు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ చేగూరు పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ విస్తీర్ణంలో సంబంధిత బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. నందిగామ మండల బృహత్ పల్లెప్రకృతివనాన్ని సంబంధిత మండలంలోని చేగూరులో ఏర్పాటు చేశారు. చేగూరులోని బృహత్ పల్లెప్రకృతివనాన్ని 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. సంబంధిత బృహత్ పల్లెప్రకృతి వనానికి మొత్తం రూ.34.82 లక్షల నిధులను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఖర్చు చేశారు. బృహత్ వనంలో పొడువు, పొట్టి, మధ్యస్థ జాతి మొక్కలు కలిపి మొత్తం 23 వేల మొక్కలను నాటారు. వీటిలో పొడువు జాతి మొక్కలు 800 కాగా, మిగతా 22,200 మొక్కలు ఇతర జాతుల మొక్కలను నాటారు. నాటిన మొక్కల్లో ప్రధానంగా ఊరుకు సమీపంలో ఏర్పాటు చేసిన దృష్ట్యా ఔషధ మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, పూలు, పండ్ల మొక్కలను నాటారు. పిల్లలు ఆడుకునేందుకుగాను సుమారు ఎకరా స్థలంలో ఆటస్థలాన్ని ఏర్పాటు చేశారు. బృహత్ వనంలో వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయడంతోపాటు సేద తీరేందుకు చైర్లను ఏర్పాటు చేశారు. చేగూరు బృహత్ పల్లె ప్రకృతి వనంలో 31 రకాల మొక్కలను నాటారు. బృహత్ వనంలో నాటిన మొక్కల్లో చింత, వేప, కానుగ, గంగా రావి, నేరేడు, గోరింట, జామ, దానిమ్మ, సీతాఫలం, సీమచింత, క్లోరోడిండైన్, మునగ, ఎర్రగడ్డి, మర్రి, వెదురు, రావి, చురుగు, రైన్ చెట్టు, విప్ప, బొప్పాయి, షిశు, ఫిబ్రవరి ఫ్లవర్, బిల్వ పత్రం, మేడి, గాంచుసీమ, టెకోమా, మద్ది, పనస, పెల్టోఫామ్, మారెడు మొక్కలను నాటారు.
పచ్చదనం పెంపొందించడమే లక్ష్యం..
పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు నిర్ణయించింది. జిల్లాలో 21 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా, ఇప్పటికే మోడల్గా తీర్చిదిద్దిన నందిగామ మండలంతో పాటు మరో 4 మండలాల్లో బృహత్ వనాలు ఏర్పాటయ్యాయి. మిగతా మండలాల్లో త్వరలోనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం.