వికారాబాద్, జూలై 14: రైతులు మొ క్కజొన్న పంటలపై అవగాహన పెంచుకొని, పంట దిగుబడిని సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని ధారూరు, పూడూరు, వికారాబాద్ మండలాల్లో కత్తెర పురుగు ఉనికి మొక్కజొన్న పంటలపై గమనించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ మాట్లాడుతూ జిల్లాలో వానకాలం మొక్కజొన్న పంటను 52, 800 ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. పురుగు మొదటి దశ లార్వా ఆకులను తింటూ ఆకులపై రంధ్రాలు చేస్తుందని, ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయన్నారు. లార్వా పెరుగుతున్న కొద్ది ఆకుల చివర నుంచి తింటూ, ఆకులను కత్తిరించినట్లుగా ఆకులను పూర్తిగా తినివేయటాన్ని గమ నించవచ్చన్నారు. కత్తెర పురుగు నివారణకు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు క్లొరిఫైరిఫాస్ 20ఈసీ 2 మిల్లిలీటర్లు, ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నివారణకు కొరజెన్ 0.4మిల్లిలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోమెట్ 0.4 గ్రాముల మందును, స్పైనో సాడ్ 0.3 మిల్లిలీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి ఆకు సుడులలో పిచికారీ చేయాలన్నారు. విషపుఎరలు 10కిలోల తవుడు, 2కిలోల బెల్లం, తగినంత నీరు కలిపి ఒక రోజు పులియబెట్టి, 100గ్రాముల తయోడికార్భ్ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆకు సుడులలో వేసి కూడా నివారించుకోచ్చని వివ రించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.