గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు
సబ్సిడీ గొర్రెలతో రూ.100 కోట్ల ఆదాయం
ఒక్కో ఈతకు రూ.28 వేల లాభం
త్వరలో రెండో విడుత పంపిణీకి ఏర్పాట్లు
21 వేల మంది లబ్ధిదారులకు అందనున్న గొర్రెలు
రూ.250 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెల కొనుగోలు
రంగారెడ్డి, జూలై 28, (నమస్తే తెలంగాణ): గొల్లకురుమలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తూ సబ్సిడీపై పంపిణీ చేసిన గొర్రెలు రెట్టింపునకుపైగా అయ్యాయి. లాభాల పంట చేతికందడంతో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. గతేడాది తొలి విడుతలో 75 శాతం సబ్సిడీతో ఒక్కో యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేయగా, మూడు పర్యాయాలు గొర్రె పిల్లలతోపాటు ఉన్నితో లబ్ధి పొందారు. ఒక్కో ఈతకు రూ.28 వేల ఆదాయం రాగా, ఇప్పటివరకు రూ.84 వేల మేర లాభాలు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా సబ్సిడీ గొర్రెలతో దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో రెండో విడుత గొర్రెల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా 21 వేల మంది లబ్ధిదారులకు రూ.250 కోట్లు ఖర్చు చేసి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నది. గతేడాది పంపిణీ చేసిన గొర్రెలతో లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. ఇప్పటికే మూడు పర్యాయాలు ఆదాయం పొందారు. ఒక్కో ఈతకు రూ.28 వేల చొప్పున.. ఒక లబ్ధిదారుడికి ఇప్పటివరకు రూ.84 వేల ఆదాయం సమకూరింది. ఇక జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసిన గొర్రెలతో దాదాపు రూ.100 కోట్ల ఆదాయం సమకూరింది. అదేవిధంగా త్వరలోనే రెండో విడుతలో భాగంగా గొర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లాలోని లబ్ధిదారుల కోసం కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకురానున్నారు. గొర్రెల యూనిట్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడాది కూడా లాటరీ పద్ధతిలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలోని గొల్లకురుమల సొసైటీ సభ్యుల్లో కొంతమందికి గతేడాది గొర్రెలను పంపిణీ చేయగా మిగిలినవారికి త్వరలో అందజేయనున్నారు. జిల్లాలో రెండో విడుతలో భాగంగా 21 వేల మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. అయితే గతేడాది 21 వేల మందికి గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉండగా 11,750 మంది మాత్రమే డీడీలు చెల్లించగా, వీరికి మాత్రమే పంపిణీ చేశారు. అయితే కరోనా వైరస్ ప్రభావం, ఎన్నికల దృష్ట్యా 11,377 మందికి గొర్రెలను పంపిణీ చేయగా, మిగతా 373 మందికి ప్రస్తుతం అందజేస్తున్నారు. ఇంకా జిల్లాలోని మంచాల మండలంలో 29మందికి, ఫరూఖ్నగర్ మండలం చించోడ్లో 22 మందికి గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది. వీరికి ఈ నెలాఖరులోగా పంపిణీ ప్రక్రియ పూర్తి చేసేందుకుగాను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తొలి విడుతలో గొర్రెల పంపిణీకిగాను రూ.142 కోట్లను ఖర్చు చేసింది.
త్వరలో రెండో విడుత..
రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం త్వరలోనే చేపట్టనున్నది. గతేడాదే రెండో విడుత గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ.. కరోనా వైరస్, ఎన్నికల దృష్ట్యా వాయిదా పడిన సంగతి తెలిసిందే. రెండో విడుత గొర్రెల పంపిణీకిగాను రూ.250 కోట్లతో కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకురానున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 42 వేల మంది లబ్ధిదారులుండగా.. వీరిని ఏ, బీ గ్రూపులుగా విభజించి లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ఒక్కో యూనిట్ కింద 20 గొర్రెలతోపాటు ఒక గొర్రె పొట్టేలును పంపిణీ చేస్తున్నారు. మొదటి విడుతలో ఒక్కో యూనిట్కు రూ.1.25 లక్షలు వెచ్చించారు. ఇందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీని ఇవ్వగా, మిగతా 25 శాతం డబ్బును లబ్ధిదారులు చెల్లించారు. అంటే ప్రభుత్వం రూ.93,750 భరించగా.. లబ్ధిదారులు రూ.31,250లను చెల్లించారు.
లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నాం…
రెండో విడుత గొర్రెల పంపిణీకి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం. లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రక్రియను చేపడుతాం. రెండో విడుతలో భాగంగా రూ.250 కోట్లతో 21 వేల మందికి గొర్రెలను పంపిణీ చేయనున్నాం.