పటాన్చెరు, జూలై 12 : ఇస్నాపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో కులం, మతం, వర్గం, ప్రాంతం అనే తేడాలు లే కుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నట్లు తెలిపారు. విశ్వాసానికి ప్రభువైన జగన్నాథుడి కృ పతో నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయం అభివృద్ధికి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, జైపాల్రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నా రు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
అమీన్పూర్, జూలై 12 : ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మాధవపురి హిల్స్ కాలనీలో రూ.70 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పరిధిలో ప్రతి కాలనీలో పార్కులు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. మాధవపురి హిల్స్ కాలనీ ప్రజలు స్వచ్ఛందంగా పార్కు నిర్మాణానికి సహకరించడం అభినందనీయమన్నారు. త్వరలోనే సోసైటీ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్ మహదేవరెడ్డి, ఇతర వార్డుల కౌన్సిలర్లు నవనీత జగదీశ్, చంద్రకళ, గోపాల్, బిజిలీ రాజు, కల్పనాఉపేందర్రెడ్డి, మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
రామచంద్రాపురం, జూలై 12: బీరంగూడ..కిష్టారెడ్డిపేట వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆర్సీపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జుననగర్ కృష్ణుడి ఆలయం వద్ద చేపడుతున్న బ్రిడ్జి విస్తరణ పనులను సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బ్రిడ్జి విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిడ్జి విస్తరణ పనుల్లో భాగంగా వరదనీరు కాలనీలోకి వస్తున్నాయని కాలనీవాసులు తమ దృష్టికి తీసుకురావడంతో స్వయంగా వచ్చి పరిశీలించానన్నారు. బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండున్నర కిలోమీటర్ల వరకు పనులు పూర్తయిన్నట్లు చెప్పారు. రోడ్డు విస్తరణలో భాగంగా బ్రిడ్జి విస్తరణ పనులను సైతం త్వరగా పూర్తిచేయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు సుమారు రూ.50కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపకమిషనర్ బాలయ్య, మల్లికార్జుననగర్ అధ్యక్షుడు రఘురాంరెడ్డి, నాయకులు నగేశ్, లక్ష్మారెడ్డి, విఠల్ ఉన్నారు.