రంగారెడ్డి, జూలై 9, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నది. ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తూ అభివృద్ధి చేస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లను నిర్మించి, రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ప్రతీ గ్రామపంచాయతీలోనూ సీసీ రోడ్లను నిర్మించారు. సీసీ రోడ్లతోపాటు అంగన్వాడీ భవనాలనూ నిర్మించారు. రోడ్ల మరమ్మతులకుగాను ఏడేండ్లలో ఉమ్మడి జిల్లాకు రూ.200 కోట్లకుపైనే నిధులను మంజూరు చేసింది. సమైక్య పాలనలో అత్యధిక గ్రామాలకు రోడ్లులేని పరిస్థితి ఉండేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడేండ్లలో సీసీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. సమైక్య ప్రభుత్వంలో కేవలం అరకొర నిధులను మాత్రమే కేటాయించేవారు. కనీసం రోడ్ల మరమ్మతులకూ నిధులివ్వని దుస్థితి ఉండేది.
రెండేండ్లలో రూ.180 కోట్ల నిధులు..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రోడ్లకు మహర్దశ వచ్చింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను విడుదల చేసింది. సమైక్య రాష్ట్రంలో కేవలం రూ.2-3 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేయడంతో కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టలేని పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం గత రెండేండ్లలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణంతోపాటు రోడ్ల నిర్వహణకుగాను పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. రెండు విడుతల్లో ఉమ్మడి జిల్లాకు రూ.180 కోట్లకుపైనే నిధులు విడుదలయ్యాయి. మొదటి విడుతలో ఉమ్మడి జిల్లాలో 85 కిలోమీటర్ల మేర 12 పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికిగాను రూ.52.26 కోట్ల నిధులు విడుదల కాగా, రెండో విడుతలో 4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికిగాను రూ.21.45 కోట్ల నిధులు విడుదలయ్యాయి. జిల్లాలోని ప్రధాన వాగులపై 4 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.14.63 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 83.19 కిలో మీటర్ల మేర 12 రోడ్ల నిర్మాణానికిగాను రూ.50.10 కోట్ల నిధులు, రెండో విడుతలో 9.9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.7.19 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వికారాబాద్ జిల్లాలో రెండు బ్రిడ్జిల నిర్మాణానికిగాను రూ.3.39 కోట్ల నిధులు విడుదల కాగా, సంబంధిత పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. రోడ్ల నిర్వహణకుగాను ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాకు రూ.40 కోట్ల నిధులను రోడ్ల నిర్వహణకు విడుదల చేశారు. రోడ్ల నిర్వహణకు విడుదలైన నిధులకు సంబంధించి నియోజకవర్గాల వారీగా పరిశీలించినట్లయితే, చేవెళ్ల నియోజకవర్గానికి రూ.6 కోట్లు, ఇబ్రహీంపట్నానికి రూ.6 కోట్లు, కల్వకుర్తి రూ.2.86 కోట్లు, మహేశ్వరం రూ.6.55 కోట్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రూ.4 కోట్లు, షాద్నగర్ నియోజకవర్గానికి రూ.5 కోట్లు, కొడంగల్ నియోజకవర్గానికి రూ.కోటి, పరిగి నియోజకవర్గానికి రూ.1.69 కోట్లు, తాండూర్ నియోజకవర్గానికి రూ.3.15 కోట్లు, వికారాబాద్ నియోజకవర్గానికి రూ.3.60 కోట్ల నిధులను రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులిచ్చింది.
అద్భుతంగా గ్రామీణ రోడ్లు…
తెలంగాణ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులు విడుదల చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ రోడ్లు అద్భుతంగా మారాయి. గత ప్రభుత్వాల హయాంలో ఏడాదికి రూ.2-3 కోట్ల నిధులతోనే సరిపెట్టేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి గ్రామాలకు లింక్ రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ప్రతీ గ్రామపంచాయతీలో పల్లెప్రగతిలో భాగంగా సీసీ రోడ్లనూ నిర్మించారు. రెండేండ్లలో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి రూ.180 కోట్లు, రోడ్ల నిర్వహణకు రూ.40 కోట్లను ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.