నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు రాష్ట్ర పర్యటన చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి బుధవారం రాత్రి వేల్పూర్కి చేరుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగృహంలో రాత్రి బస చేశారు. గురువారం ఉదయం వేల్పూర్ గ్రామంలో మంత్రి వేములతో కలిసి పర్యటించారు. మంత్రి వేముల స్వగ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, రైతు వేదికలను సందర్శించారు. రైతు వేదిక ప్రాంగణంలో వేప మొక్కను మంత్రి ఎర్రబెల్లి నాటారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఓ కిరణం షాపు ముందట అపరిశుభ్ర వాతావరణం ఉండటాన్ని గమనించిన మంత్రి ఎర్రబెల్లి సదరు దుకాణం యజమానికి 100 రూపాయలు జరిమానా విధించారు.