నల్లగొండ ప్రతినిధి, జూలై 2(నమస్తే తెలంగాణ) : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల రూపురేఖలను మార్చివేస్తున్నాయి. పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటు మొదలుకొని మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించగా ఏడో విడుత హరితహారంలో భాగంగా పచ్చదనం పెంపునకు భారీగా మొక్కలు నాటుతున్నారు. గతంలో నిధుల కొరతతో కునారిల్లిన గ్రామాలు నేడు జనాభా ప్రాతిపదికన అందుతున్న నిధులతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. శాశ్వత వనరులుగా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో పాటు వైకుంఠ ధామాల నిర్మాణం, డంపింగ్ యార్డుల నిర్వహణను కూడా ప్రతి గ్రామానికీ తప్పనిసరి చేస్తూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు.
నల్లగొండ జిల్లాలో మొత్తం 844గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి గ్రామానికీ ప్రభుత్వం నిధులు సమకూర్చుతున్నది. ప్రతి నెలా 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.18కోట్లు విడుదల చేస్తున్నది. గ్రామంలోని ఒక్కో వ్యక్తికి ప్రతి నెలా రూ.136 చొప్పున ఏడాదికి రూ.1632 వెచ్చిస్తున్నది. సూర్యాపేట జిల్లాకు నెలకు రూ.12కోట్లు విడుదలవుతున్నాయి. ప్రతి గ్రామానికీ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేశారు. వీటితో ప్రతి రోజూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. శిథిల నిర్మాణాలను తొలగించడంతో పాటు డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు. దాంతో గతంలో మాదిరిగా విషజ్వరాల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది.
శాశ్వత వనరులపై ప్రధాన దృష్టి…
గ్రామాల్లో శాశ్వత వనరులపై ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఎకరం స్థలానికి తగ్గకుండా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు అన్ని రకాల మొక్కలను నాటడంతో పాటు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. పార్క్ల తరహాలో వీటిని నిర్వహిస్తున్నారు. అదనంగా ప్రతి ఇంట్లో మొక్కలు పెంచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దాంతో రానున్న రోజుల్లో ప్రతి పల్లె ఓ నందనవనం కానున్నది. ఏడో విడుత హారితహారంలో నల్లగొండ జిల్లాలో 1.26కోట్ల మొక్కలను నాటేందుకు సిద్ధమయ్యారు. ఇక గ్రామాలు, వార్డుల వారీగా విద్యుత్ సమస్యలపై దృష్టిసారించి తక్షణమే పరిష్కరిస్తున్నారు. గతంలో స్తంభాన్ని మార్చాలంటే ఏండ్ల సమయం పట్టేది. కానీ, నేడు ముందే గుర్తించి సరిచేస్తున్నారు. వంగిపోయిన స్తంభాలు, లూజు వైర్లు, ఇండ్ల పైనుంచి వెళ్లే కరెంటు తీగలను సరిచేస్తున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ‘పవర్ డే’ నిర్వహించి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
పట్టణం..పరిశుభ్రం
పట్టణ ప్రగతి పనులతో సూర్యాపేట మున్సిపాలిటీలోని వార్డులు పరిశుభ్రంగా మారుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. ఖాళీ ప్లాట్లల్లో కంప చెట్లను తొలగించడం, డ్రైనేజీలను పూడిక తీయించడంతో పాటు ప్రజల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యలకు సైతం పట్టణ ప్రగతిలో పరిష్కారం లభిస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. – బొడ్రాయిబజార్, జూలై 2
పల్లె నుదుటిపై ప్రగతి తిలకం
పల్లె నుదుటిపై ప్రగతి తిలకం
గ్రామసీమలు కావాలి స్వర్గసీమలు…
అవి దేశానికి పట్టు కొమ్మలు
పల్లె అంటే ఆనందాల హరివిల్లు..
అనురాగాల పొదరిల్లు
దశాబ్దాల నిర్లక్ష్యంతో
మల్లెలాంటి పల్లె మసకబారిపోయింది
బావురుమంటున్న బాటలు..
మురికికూపాలు దుర్గంధ భరితాలు
మౌలిక వసతులకు నోచుకోక..
అంతిమ సంస్కారాలకూ అంతులేని అవస్థలు..
సమస్యల మూలాలను తెలుసుకొని..
పల్లె పురోగమించేట్లు పల్లె ప్రగతి వచ్చింది
దార్శనిక పాలనకు నిదర్శనంగా,
స్వపరిపాలనలో సుపరిపాలన దిశగా సాగిపోతోంది..
ప్రకృతి వనాలు.. మంచినీటి సౌకర్యాలు..
బాగుపడిన దారులు, హరితహారాలు…
అంతిమ మజిలీకి వైకుంఠధామాలు,
చిత్తశుద్ధితో చేస్తే చెత్తా, చెదారం సమస్యకాదని నిల్చిన నిదర్శనాలు
ఎప్పుడో చెదిరిన పల్లె నుదుటిపై ప్రగతి తిలకం దిద్దుదాం..
ఊపిరి ఉన్నంత వరకు ఉన్న ఊరికి ఊతం ఇద్దాం..
జాతిపిత కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని మన దగ్గరే నిజం చేద్దాం.
ఈ కాలం సర్పంచులు అదృష్టవంతులు..
నేను 1981లో గణపవరం సర్పంచ్గా ఎన్నికయ్యా. సుమారు 15ఏండ్ల పాటు పనిచేసినా.. పంచాయతీకి ఆదాయం లేకపోవడంతో అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాను. అప్పట్లో పంచాయతీకి నిధులు తక్కువగా వచ్చేవి. గ్రామ జనాభా 600మంది ఉంటే తలా ఒక్క రూపాయి చొప్పున రూ.600మంజూరయ్యేవి. కానీ, నేడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను కుమ్మరిస్తున్నది. నిధులు వరదలా వస్తున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఏండ్లనాటి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు ఈ కాలం సర్పంచులు చాలా అదృష్టవంతులు.