మేయర్ బంగి అనిల్కుమార్
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సందర్శన
కోల్సిటీ, జూన్ 26: మిషన్ భగీరథ ద్వారా రామగుండం నగరానికి రక్షిత నీరు సరఫరా అవుతున్నదని మేయర్ బంగి అనిల్కుమార్ తెలిపారు. స్థానిక బీ పవర్హౌస్ గుట్ట మీద ఉన్న గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను శనివారం డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో కలిసి సందర్శించారు. మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాద్, నగర పాలక సంస్థ సహాయక ఇంజినీర్ జమీల్ నీటి శుద్ధి ప్రక్రియను మేయర్కు వివరించారు. క్లోరిన్ పరీక్ష ఫలితాలను మేయర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 39వ డివిజన్ ఖాజీపల్లి వద్ద నీటి సరఫరా పైపులైను లీకేజీ మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం రామగుండం రైల్వే వంతెన వద్ద మురుగునీటి కాలువ పనుల కారణంగా పగిలిన నీటి సరఫరా పైపులైను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట కార్పొరేటర్లు సతీశ్కుమార్, నాయకులు జెట్టి రమేశ్, సలీం ఉన్నారు.
నిర్మాణ పనుల పరిశీలన
జ్యోతినగర్(రామగుండం), జూన్ 26: రామగుండం 20వ డివిజన్ పరిధిలోని ఎస్టీ, బీసీ కాలనీల్లో మురుగు నీటి కాలువ నిర్మాణ పనులను మేయర్ అనిల్కుమార్ శనివారం పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కన్నూరి సతీశ్కుమార్ అన్ని కాలనీల్లో డ్రైనేజీలు నిర్మించాలని, తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. అనంతరం మేయర్ రామగుండం బీ పవర్హౌస్ వాటర్ ట్యాంక్ క్లోరినేషన్ను తనిఖీ చేశారు. ఇక్కడ డిప్యూటీ మేయర్ అభిషేక్రావు తదితరులు ఉన్నారు.