గద్వాల, జూన్ 22: విద్యాపరంగా నడిగడ్డ ప్రాంతం వెనుకబడిందని, ఈ ప్రాంతంలో ఉన్నతవిద్యకు సహకరిస్తానని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ లక్ష్మీకాంత్రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం నదీఅగ్రహారం సమీపంలోని పీజీ కళాశాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పీజీ కళాశాలలో అదనంగా ఏంబీఏ కళాశాలను ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కళాశాలలో విద్యార్థులకు రూ.9కోట్లతో వసతి గృహాలు నిర్మించారని, త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. పీజీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పీయూ పరిధిలో 78 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరయ్యాయని తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కోరినట్లు పీజీ కళాశాలకు అదనపు పీజీ కోర్సులు మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో విద్యారంగంలో గద్వాల వెనుకబడిందని అన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయంతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాడన్నారు. ప్రస్తుతం పీజీ కళాశాలలో ఉన్న కోర్సులకు అదనంగా ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జూవాలజీ కోర్సులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వీసీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన వీసీ ఈ ఏడాది ఎంబీఏకు అనుమతి ఇస్తున్నామని, మిగతా కోర్సులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. త్వరలో పీజీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వసతి గృహాలతోపాటు పీజీ కళాశాలను ప్రారంభించడానికి వచ్చే నెల 15వరకు మంత్రి కేటీఆర్తో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సత్యసాయి డిగ్రీ, పీజీ కళాశాలలో వీసీని సన్మానించారు. అంతకుముందు కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, పీయూ రిజిస్ట్రార్ పవన్కుమార్, డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ, ఓఎస్డీ డాక్టర్ మధుసూదన్రెడ్డి, ఎంపీపీలు ప్రతాప్గౌడ్, విజయ్, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, జెడ్పీటీసీ రాజశేఖర్, డీఈవో సిరాజుద్దీన్, డిగ్రీ కళాశాలల జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, సత్యసాయి పీజీ కళాశాల యాజమాన్యం బీచుపల్లి, సీనియర్ క్రీడాకారులు బాలరాజు, ప్రభాకర్, వీరవసంతరాయుడు, న్యాయవాది మధుసూదన్బాబు తదితరులు పాల్గొన్నారు.