పల్లె ప్రకృతి వనాల్లో ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్న మొక్కలు
సేదతీరుతున్న ప్రజలు
గంగాధర, జూన్ 13: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం లక్ష్యం నెరవేరుతున్నది. హరితహారంలో భాగంగా గతేడాది గ్రామానికో ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సహజంగా కనిపించే ప్రకృతి సౌందర్యానికి, సహజత్వానికి మరింత కొత్త అందాలను అద్దడానికి వనంలో వివిధ రకాల పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో బోరు వేయించి సంరక్షణ చర్యలు చేపట్టడంతో మొక్కలు ఏపుగా పెరిగి సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
ఏపుగా పెరిగిన మొక్కలు
హరితహారంలో భాగంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల్లో మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల్లో 28,265 మొక్కలు నాటారు. వనాల్లో వరుస క్రమంలో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు హద్దులు నిర్ణయించి ఇనుప కంచె ఏర్పాటు చేశారు. కంచె లోపల హద్దుల వద్ద ప్రజలు నడవడానికి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, ట్రాక్ హద్దుల పక్కన వేప, మర్రి, కానుగ, బాదం, రావి వంటి నీడనిచ్చే మొక్కలు నాటారు. లోపలి భాగంలో జామ, దానిమ్మ, సీతాఫలం, నేరేడు వంటి పండ్ల మొక్కలు, మందారం, గులాబీ, మల్లె, గన్నేరు వంటి పూల మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో వాచర్ను ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు చేపట్టడంతో మొక్కలు ఏపుగా పెరిగాయి. ప్రకృతి వనంలో పిల్లలు ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం గ్రామస్తులు వాకింగ్ చేయడంతో పాటు సేదతీరుతున్నారు.