నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. సదాశివనగర్ మండలం పద్మాజీవాడి వద్ద ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించారు. గాయపడిన వారిని తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా నిజామాబాద్లో బంధువు అంత్యక్రియలకు హాజరై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం బారినపడ్డారు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.