న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారిని అడ్డుపెట్టుకుని అక్రమంగా దండుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాన్ని నిందితులు వాస్తవ ధర కంటే ఏకంగా 36 రెట్లు అధికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే యాంఫోటెరిసిన్-బీ మందు 20 వయల్స్ ను లక్నో నుంచి సేకరించి అధిక ధరలకు అమ్ముతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఔషధం ధర రూ 330 కాగా దీన్ని రూ 11,300కు వారు అమ్ముతున్నారు.
నిందితులను రజనీష్ శ్రీవాస్తవ, ముర్తజా ఖాన్ గా గుర్తించారు. యాంఫోటెరిసిన్-బీ బ్లాక్ మార్కెటింగ్ గురించి కొవిడ్ హెల్పర్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఇద్దరు విద్యార్ధులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ రాకెట్ గుట్టు రట్టైంది. వీరు ఈ డ్రగ్ అవసరమైన వారి కోసం నిందితులను ఆశ్రయించగా 20 వయల్స్ ను రూ 2.26 లక్షలకు అందచేస్తామని చెప్పడంతో విద్యార్ధులు పోలీసులకు సమాచారం అందించారు. మ్యాక్స్ హాస్పిటల్ వద్దకు నిందితులు రాగా విద్యార్ధులతో అక్కడికి వచ్చిన పోలీసులు వలపన్ని వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి యాంఫోటెరిసిన్-బీ వయల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.