ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర
ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో వ్యాపారులకు సూచన
ఆసిఫాబాద్, మే 20 : కరోనా కట్టడిలో భాగంగా జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్ను ఇకనుంచి నూతనంగా నిర్మించిన జూబ్లీమార్కెట్లో విక్రయించాలని ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర వ్యాపారులకు సూచించారు. గురువారం ఆయన వ్యాపారులను కలిసి మాట్లాడారు. ప్రజలు ఎక్కువగా తరలిరావడంతో మార్కెట్ ఏరియాలో రద్దీ ఉంటుందని, దీంతో మార్కెట్ను నూతనంగా నిర్మించిన షెడ్లకు తరలించాలని పం చాయతీ కార్యదర్శి రాజబాబుకు సూచించారు. వ్యాపారులు, వినియోగదారులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తేనే వైరస్ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఆయన వెంట డీఎస్పీ అచ్చేశ్వర్రావు, సీఐ అశోక్, గ్రామ పంచాయతీ సిబ్బంది, కూరగాయల వ్యాపారులు ఉన్నారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి..
కాగజ్నగర్టౌన్ , మే 20: పట్టణంలో లాక్డౌ న్ అమలు తీరును ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సడలింపు సమయంలోనే ప్రజలు తమ పనులను పూర్తిచేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం రాజీవ్గాంధీ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేసి అవగాహన కల్పించారు. పట్టణ ఎస్హెచ్వో మోహ న్, ఎస్ఐలు వెంకటేశ్, తహిసొద్దీన్ ఉన్నారు.